మారేడ్పల్లి, జూలై 19: నిరుద్యోగ యువతకు ఆర్టీసీ సంస్థ శిక్షణ ఇవ్వడంతో పాటు,ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయడం ఎంతో సంతోషకరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. టీఎస్ ఆర్టీసీ పికెట్ డిపో ఆధ్వర్యంలో డిపో ఆవరణలో హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ (శిక్షణ బస్సు)ను ఆర్టీసీ అధికారులు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పికెట్ డిపో మేనేజర్ జి. సురేశ్ మాట్లాడుతూ….పికెట్ డిపో ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ స్కూల్ ప్రారంభమైందన్నారు.
30 రోజుల పాటు శిక్షణలో 25 రోజులు డ్రైవింగ్, రోడ్డు భద్రతలపై, 5 రోజుల పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ బస్సుపై శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.15,600 చెల్లించాలన్నారు.శిక్షణ ముగిసిన తరువాత ఆర్టీసీ ధ్రువీకరించబడిన సర్టిఫికెట్ను అందజేస్తామని, భవిష్యత్లో ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ సర్టిఫికెట్ ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ రూరల్ డీవీఎం. రాంచంద్రారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ పరిమళ, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.