బంజారాహిల్స్,ఆగస్టు 13: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దుడికి సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి లాకర్లోనుంచి డబ్బులు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన విరూపాక్ష గౌడ్ (81) అనే వృద్ధుడికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో యశోదా ఆస్పత్రిలో చేరారు. కొన్నాళ్లు ఆస్పత్రిలో ఉన్న తర్వాత ఆరోగ్యం కొంత కుదుట పడింది.
కొన్నాళ్లపాటు ఇంటికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని బావించిన విరూపాక్ష గౌడ్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశాడు. అయితే అతడి పనులను చూసేందుకు హోమ్ కేర్ సర్వీసెస్ కావాలని వైద్యులు సూచించడంతో అమీర్పేటలోని ఓ సంస్థను సంప్రదించారు. ఈ నెల 16నుంచి నవీన్ అనే వ్యక్తిని సహాయకుడిగా పంపించారు.
కాగా వారంరోజుల క్రితం విరూపాక్ష గౌడ్ గదిలో నిద్రిస్తున్న సమయంలో ఆయన లాకర్లో పెట్టిన రూ.1.90 లక్షల నగదును నవీన్ తస్కరించి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
జరిగిన విషయాన్ని గురించి సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం బాధితుడు విరూపాక్ష గౌడ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.