శేరిలింగంపల్లి, ఆగస్టు 23 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం… పెద్దపల్లి జిల్లా తేరెపల్లి గ్రామానికి చెందిన ఆర్.మౌనిక హెచ్సీయూలో ఎంటెక్ మెటీరియల్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. క్యాంపస్లోని లేడీస్ హాస్టల్-7లోని 20వ నంబర్ గదిలో ఉంటుంది. కాగా ఆదివారం నుంచి మౌనిక హాస్టల్ గదిలోనుంచి బయటకు రాలేదు. స్నేహితులు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు యూనివర్సిటీ, హాస్టల్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి మౌనిక గది వద్దకు చేరుకున్న వారు తలుపు, గడియ తొలగించి చూడగా.. ఉరివేసుకొని కనిపించింది. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.