సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా?.. ఆర్థిక ఇబ్బందులతో దవాఖానల్లో చేరలేక.. ఆక్సిజన్లేక అవస్థలు పడుతున్నారా?.. అలాంటివారికి మేం ఉన్నామంటూ ముందుకు వచ్చింది హర్యానా నాగరిక్ సంఘ్. పేదలు ఎవరు కూడా కరోనా వచ్చిందని అధైర్యపడవద్దు.. మీకు మేము ఉన్నామని భరోసా ఇస్తున్నది. బాధితుల కోసం 80ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచుకుని.. సంప్రదించినవారికి ఉచితంగా అందిస్తున్నది. ఇలా నగరంలో ఇప్పటి వరకు 750 మందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించారు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావాల్సినవారు పురుశోత్తమ్ అగర్వాల్ 9849013090ను సంప్రదించాలి.
హర్యానా నాగరిక్ సంఘ్ రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 95 బాలలు, వృద్ధుల అనాథాశ్రమాలను గుర్తించింది. ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం అందిస్తూ దాదాపు 4500 మంది ఆకలి తీరుస్తున్నది. అలాగే రాత్రి సమయాల్లో హైవేలపై భోజనాన్ని అందిస్తున్నది. కరోనా మొదటి దశలో కూడా ఈ సంఘం దాదాపు 4.50 లక్షల మందికి భోజనాన్ని అందించింది. నెల రోజుల్లో దాదాపు 1200యూనిట్ల రక్తాన్ని, ప్లేట్లెట్స్లను శిబిరాల ద్వారా సేకరించి.. వాటిని రక్త నిల్వల కేంద్రాలకు అందించింది. గత రెండు రోజుల కిందట ఓ వ్యక్తికి 42యూనిట్ల రక్తాన్ని అందించింది.
హర్యానా నుంచి నగరానికి వలస వచ్చి ఉంటున్న వారితో ఏర్పడిన ఈ హర్యానా నాగరిక్ సంఘ్లో దాదాపు వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వారి సహకారంతో అనాథ పిల్లలు, వృద్ధులు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించి.. వారికి అండగా ఉంటున్నాం. ఆహారం అందించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. సహాయం కోసం ఎవరు అడిగినా.. మా సంఘం ముందుంటుంది. మా సేవలను గుర్తించి హైదరాబాద్, రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులు ప్రోత్సహిండం చాలా ఆనందంగా ఉంది.-అంజనీకుమార్ అగర్వాల్, హర్యానా నాగరిక్ సంఘ్ అధ్యక్షుడు