సికింద్రాబాద్,అక్టోబర్ 11 :చూసేందుకు రెండడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. చిన్న తొట్టిలో హోయలు పోతాయి. గుబురుగా పెరిగి ఆకర్షిస్తుంటాయి. అవే బోన్సా య్ వృక్షాలు. ఇటీవల వీటి పెంపకం ఊపందుకుంటుంది. ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో మరుగుజ్జు వృక్షాల పెంపకం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మొక్కలను బహుమతులుగా కూడా ఇస్తున్నారు. అలంకరణ కోసం ఎ క్కువ మంది వీటిని ఇండ్లల్లో పెంచుకుంటున్నా రు. ఆసక్తి కొద్ది కొందరు బోన్సాయ్ ఆర్ట్ను నేర్చుకుని పెంపకంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
గతంలో గ్రామాల్లో, రోడ్ల పక్కన ఎక్కువగా భారీ చింతచెట్లు కనిపించేవి. క్రమంగా చింత చెట్ల సంఖ్య తగ్గుతున్నది. బోన్సాయ్ రకంలో ఉన్న ఎర్ర చింత కాయల చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మేడి చెట్టు, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, మామిడి, మిరపకాయ, కమల కాయ వంటి ఫలాలను ఇచ్చే రకాల చెట్లను పెంచుకుంటున్నారు.
ఎక్కువ మంది అలంకరణ వృక్షాలనే ఇష్టపడుతున్నారు. వీటిలో ముఖ్యంగా క్యాక్టస్, సర్కిలెంట్ మొక్కలు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఈ మొక్కలు ఏడాది పాటు నీరు లేకున్నా వాటి మనుగడ కొనసాగుతుంది. వీటి ధర రూ.1000 పైబడి ఉంటుంది.
పెద్ద వృక్షానికి మినీయేచర్ రూపమే బోన్సాయ్. కొందరు మరుగుజ్జు చెట్లు అని కూడా పిలుస్తారు. బోన్సాయ్ వృక్షాలంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కావు. నర్సరీలో లభించే సాధారణ మొక్కలే. బోన్సాయ్ మొక్కలను ప్రధానంగా ఆరు రకాల ఆకృతుల్లోనే పెంచుతుంటారు. మొక్క రకాన్ని బట్టి ఆకృతిని ఎంచుకుంటారు. ఇక్కడే పెంచే వారి కళ తెలుస్తున్నది.
మొదట్లో సాధారణ కుండీలు, కవర్లలో పెంచినా.. వయస్సు పెరిగే కొద్ది వేళ్లు విస్తరించే క్రమంలో సాధారణ కుండీలు పగిలిపోయే అవకాశం ఉంది. దీంతో ట్రే ఆకారంలో ఉండే సిరామిక్ తొట్టీలను వాడుతుంటారు. మొక్కలకు పోషకాలు మట్టి నుంచి అందుతాయి. 60 శాతం సేంద్రియ ఎరువు, 20 శాతం ఎర్రమట్టి, 20 శాతం ఇసుకతో కలిపిన మిశ్రమంలో వృక్షాలను పెంచుతారు. రెండు అడుగుల ఎత్తు వరకు పెంచుతారు. ఎత్తును దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పెరిగిన కొమ్మలను, ఆకులను తొలగిస్తుంటారు.
అందరినీ ఆకర్షించే బోన్సాయ్ వృక్షాలు ఇప్పుడు నర్సరీలతోపాటు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్డీల్ వంటి వివిధ సంస్థలు వీటిని సైతం విక్రయిస్తున్నాయి. ధర రూ.200 నుంచి రూ.లక్ష వరకు ఉన్న చెట్లు ఉన్నాయి.
నగరంలో బోన్సాయ్ చెట్ల పెంపకం అధికంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్లోని కార్ఖానా, మడ్ఫోర్ట్, తిరుమలగిరి, బేగంపేటతోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న నర్సరీల్లో బోన్సాయ్ చెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.200 మొదలుకుని.. చెట్టును బట్టి రూ.25 వేలకు పైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన సర్సరీలతోపాటు, నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న సర్సరీల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
బోన్సాయ్ చెట్లు ఇంట్లో అందంగా ఉండటంతోపాటు ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు చెట్లను ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వాటి గురించి మాట్లాడుతుంటారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు బోన్సా య్ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రత్యేక శ్రద్ధ అవసరం..
బోన్సాయ్ వృక్షాల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తగినంత ఎండ ఉన్న చోటే వీటిని ఉంచాలి. సూర్య కిరణాలే వీటికి ఆహారం. రెండు, మూడు రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుందనుకుంటారు. కానీ రోజూ నీళ్లు పోయాలి. ఇండోర్లో వారం రోజులకు మించి బతుకలేవు.
మర్రి చెట్టు ఇంటి పెరట్లో పెంచుకోగలమా.. వాటి వేళ్లు పునాదుల్లోకి వెళ్లి ఇంటి గోడలను దెబ్బతీస్తాయి. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం కొందరు మర్రి చెట్లను కూడా ఇండ్లల్లో పెంచుకుంటున్నారు. బోన్సాయ్ పద్ధతిలో పెంచిన మర్రి చెట్లు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఇండ్లల్లో పెంచుకుని మురిసిపోతున్నారు. మర్రి చెట్టే కాదు.. చింత, ఉసిరి, జామ.. ఇలా పలు రకాల చెట్లను కుండీల్లోనే పెంచేస్తున్నారు.
ఇటీవల బోన్సాయ్ చెట్ల అమ్మకాలు పెరిగాయి. నివాసాల్లో చిన్న వృక్షాలను పెంచుకునే సంస్కృతి పెరుగుతున్నది. చెట్ల పెంపకంపై ఆసక్తి ఉన్న వారితో పాటు, ఇంటి అలంకరణ కోసం కూడా విశేషంగా వినియోగిస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నాం. బోన్సాయ్కు మంచి ఆదరణ లభిస్తున్నది. జి. వీర్రాజు, నర్సరీ నిర్వాహకులు, మడ్ఫోర్ట్, కార్ఖానా
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 11: ఎంతో విశిష్టమైన నవరాత్రి పర్వదినాల్లో ఒకే గులాబీ కొమ్మకు తొమ్మిది పువ్వులు పూచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తార్నాకలో నివాసముంటున్న ప్రముఖ కవయిత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ లక్కరాజు నిర్మల నివాసంలో ఆమె పెంచుకుంటున్న గులాబీ మొక్కకు ఈ పూలు పూశాయి. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. ఆవు పేడతో తయారైన ఎరువు మాత్రమే వేస్తూ మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. మొక్కలు ఉన్న ప్రదేశంలోనే రోజూ లలిత పారాయణం చేస్తున్నామన్నారు. నవరాత్రుల్లో నవదుర్గలు అవతరించినట్లు భావిస్తున్నట్లు వివరించారు.
కాచిగూడ : భవిష్యత్ తరాలకు బహుమతిగా పచ్చదనాన్ని ఇవ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. పర్యావరణ పరిరక్షణతోనే మంచి భవిష్యత్ ఉంటుంది. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలొస్తాయి. సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుతో మరోసారి పర్యావరణ ప్రేమికుడిగా నిరూపించుకున్నారు. హరితనిధి ఏర్పాటుతో రాష్ట్రం హరితమయం కానుంది. ఇందులో అందరినీ భాగస్వాములను చేయడం శుభపరిణామం. – వి. దానకర్ణాచారి
(ప్రభుత్వ రంగ సంస్థల తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు)
కాచిగూడ : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణాన్ని రక్షించడంతో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకువస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటుతున్నారు. హరితనిధిలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. – బీమాగౌని కృష్ణాగౌడ్(తెలంగాణ
గౌడ సంఘం జాయింట్ సెక్రటరీ)