చార్మినార్, అక్టోబర్ 10 : భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభు త్వ సంకల్పం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అధికారులు, ప్రజలు కూడా సీఎం ఆలోచనలను అమలుచేస్తున్నారు. హరితహారంలో మొక్కలు నాటుతున్నా రు. వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి సంకల్పంతో నేడు అనేక ప్రాంతా లు పచ్చగా మారుతున్నాయి. అధికారుల ప్రత్యేక శ్రద్ధతో పాతబస్తీలోని చాలా ప్రాంతాలు నేడు పచ్చదనంతో దర్శనమిస్తున్నాయి.
చెట్లు లేని సమాజాన్ని ఊహించుకోలేం. చెట్ల వల్లే కాలుష్యం తగ్గుతున్నదనేది శాస్త్రీయంగా నిరూపితమైంది. ప్రభుత్వ ఆలోచనలతో పోలీసు శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీసు హెడ్ క్వార్టర్స్ను సందర్శించే ఉన్నతాధికారులతో అక్కడి అధికారులు మొక్కలను నాటించడం మొదలుపెట్టారు. వాటిని కం టికి రెప్పలా చూస్తూ సంరక్షిస్తున్నారు. నగర పోలీ సు కమిషనర్ అంజనీకుమార్తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీపీ నాటిన మొ క్కను సంరక్షించడంతోపాటు ఆయన అందించిన సహకారంతో మరిన్ని మొక్కలు నాటారు. ప్రస్తుతం వెయ్యికి పైగా చెట్లతో పోలీసు ప్రాంగణం పచ్చదనంతో కనిపిస్తుంది. అదేవిధంగా.. ట్రైనింగ్లో ఉన్న సిబ్బందికి మొక్కలు నాటే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతితో మమేకమవడానికి కృషి చేస్తున్నారు.
జూబ్లీహిల్స్, అక్టోబర్ 10: హరితహారంతో భవిష్యత్ తరాలకు భరోసానిస్తూ.. నగర ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే ఆక్సిజన్ పార్కులను అందుబాటులోకి తెస్తున్నారు. అంతరించిపోతున్న అడవులను మియావాకితో మళ్లీ కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్న నగరపాలక సంస్థ.. నగరంలోని కాలనీల్లో కొత్తగా యాదాద్రి తరహా ప్లాంటేషన్కు శ్రీకారం చుట్టింది. కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న నగరాన్ని కాపాడుకుంటూ.. నగరాన్ని నమ్ముకున్న జనానికి స్వచ్ఛమైన గాలినందించి.. అసలు సిసలైన ఆరోగ్యాన్ని పంచేందుకు పర్యావరణ ప్రేమికులతో కలిసి కాలనీలను పచ్చదనానికి కేరాఫ్గా నిలిపేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా యూసుఫ్గూడ సర్కిల్ వెంగళరావునగర్ డివిజన్ ఏజీ కాలనీలో 14 వేల మొక్కలను నాటి చరిత్ర సృష్టించారు.
ఇక్కడ అన్ని రకాల పూలు, పండ్లు, కాయలతో కళకళలాడే చెట్లను నాటుతున్న అర్బన్ బయో డైవర్సిటీ అధికారులు లక్ష్యాన్ని చేరేందుకు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే అలనాటి చెట్లతో అలరిస్తూ .. పచ్చని పందిరి పరుచుకున్న ఏజీ కాలనీకి వేలాది మొక్కలతో ఆకుపచ్చని తోరణం కట్టనున్నారు. ఇందులో భాగంగా ఏజీ కాలనీ అధ్యక్షుడు రాజేశ్ కుమార్ చొరవతో వేలాది మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. చెత్తతో నిండిపోయిన స్థలాన్ని చదునుగా చేసి భారీ ఎత్తున చెట్లను నాటుతున్నారు. అలనాటి వృక్షాలు, చెట్లతో పచ్చదనానికి కేరాఫ్గా నిలిచిన ఏజీ కాలనీలో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో మేనేజర్ యూసుఫ్ పాష, ఎఫ్ఓ అలీ యాదాద్రి ప్లాంటేషన్ పనులు చురుకుగా చేపడుతున్నారు.
ఏజీ కాలనీవాసుల చొరవతో ఇక్కడ వేలాది మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన గాలినందించేందుకు కాలనీలో నిరుపయోగంగా ఉన్న స్థలాలన్నింటిలో మొక్కలు నాటాలని కాలనీ అధ్యక్షుడు రాజేశ్ కుమార్ కోరారు. దీంతో ఆయా స్థలాలన్నింటినీ బాగుచేసి మొక్కలు నాటుతున్నాం. సర్కిల్లోని ఏ ప్రాంతంలోనైనా, ఏ కాలనీలోనైనా ఖాళీ స్థలాలు చూపిస్తే వాటిని బాగుచేసి మొక్కలు పెంచుతాం. – యూసుఫ్ పాష, మేనేజర్, యూబీడీ..జీహెచ్ఎంసీ సర్కిల్-19
పాతనగరం పేట్లబుర్జులోని ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో ఎక్కడ చూసినా పచ్చదనమే. మొక్కలు నాటాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన క్షణం నుంచే చర్యలు చేపట్టాం. ఓ ప్రత్యేక కార్యక్రమం కింద పనిచేస్తున్నాం. అధికారులు, ఉన్నతాధికారులతో మొక్కలు నాటించాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఫలితంగా నేడు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్వచ్ఛమైన గాలిని అందుకుంటున్నారు. ట్రైనింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓ మొక్కను నాటుతున్నారు. వాటిని సంరక్షించాలని సూచించాం. పర్యావరణం సమతుల్యంగా ఉన్నప్పుడే మంచి గాలి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.- సుభాన్గౌడ్, ఏసీపీ
మియాపూర్, అక్టోబర్ 10 : పచ్చదనం పెంపునకు తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, చేపడుతున్న చర్యలు హర్షణీయం. హరిత నిధి ఏర్పాటు మంచి ఆలోచన. ప్రకృతిని పెంపొందించేందుకు ఉద్యోగులను భాగస్వాములను చేసింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉంటేనే ఆలోచన విజయవంతంగా ముందుకెళ్తుంది. నాటిన ప్రతి మొక్కను కాపాడాలి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి. హరిత నిధికి చెల్లిస్తున్న మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును ప్రభుత్వం ఆలోచించగలిగితే భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. – రావుల శశిధర్,జాయింట్ కమిషనర్, స్టేట్ టాక్స్
మహేశ్వరం, అక్టోబర్10: భావితరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నారు. హరిత నిధిపట్ల ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హరితనిధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నారు. పోలీస్స్టేషన్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలనే భావనతో హరితహారంలో మొక్కలు నాటి కాపాడుతున్నాం. రెండో దశ కరోనాలో ఆక్సిజన్ అందక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం ఇంటికి 3 మొక్కలను నాటాలి. ప్రతి ఒక్కరూ హరిత తెలంగాణకు కృషి చేయాలి.- మధుసూదన్, సీఐ మహేశ్వరం పీఎస్