సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 10 వరకు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. లక్ష్యాన్ని మించి అధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. 28,983.8 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ఎత్తివేశారు. అదేవిధంగా 15632.5 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలనూ తొలగించారు. పది రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, హరితహారం పనులను పకడ్బందీగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.936 కోట్లు కేటాయించగా 955 ప్రత్యేక బృందాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు విధిగా పాల్గొని సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో గ్రేటర్లో మరింత పచ్చదనం పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఐదేండ్ల క్రితం మొక్కలు నాటిన ప్రాంతాలను పరిశీలించడం.. మొక్కలు పెరగడానికి అడ్డంకిగా వాటిని తొలగించడం.. మొక్కలకు పాదులు చేయడం, వీడింగ్, ట్రీ గార్డులను అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాక కాలనీల్లోని పార్కులను సందర్శించి శుభ్రంగా మార్చారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. అన్ని నర్సరీల్లో మొక్కలు పెంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రకృతి వనాల కింద ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేందుకు చర్యలు చేపట్టారు.