మణికొండ, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహిస్తున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులంతా హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా భావితరాలకు పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని అందించినవాళ్లుగా ప్రతి ఒక్కరూ నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు విధిగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
అనేక మంది తమ పేర్లమీద ఏ రకమైన మొక్క నాటితే బాగుంటుందనే విషయాలపై ఇప్పటికే పండితుల వద్దకు వెళ్లి తెలుసుకుంటున్నారు. రాశిఫలాల ఆధారంగా మొక్కలను ఎక్కడ ఇస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు రాశిఫలాల ఆధారంగా మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నారు.
నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటాలన్న నిబంధన గతేడాది పెట్టారు. కానీ ఈసారి రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను మినహాయించి మొత్తంగా 21 పంచాయతీలకు ఎక్కడికక్కడా నర్సరీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రాజేంద్రనగర్ పట్టణ ప్రాంతంలోని ఐదు డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శంషాబాద్, మణికొండ, నార్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీల్లో ఇప్పటికే హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని ఒక్కో వార్డుకు 22వేల మొక్కలు నాటాలన్న సంకల్పంతో కౌన్సిలర్లు ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈసారి 20లక్షల మొక్కల పెంపకమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పట్టణప్రగతిలో హరితహారం కింద నాటేందుకు అవసరమైన మొక్కలను శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలోని నర్సరీలో పెంచుతున్నారు. వర్షాలు కురిస్తే చాలు వెనువెంటనే మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీచేశారు. సీమ తంగెడు, ఉసిరి, వేప, దానిమ్మ, గన్నేరు, గులాబీ, మందారం, జామ, ఈత, మారేడు, నిమ్మ, బాదం, మునగ తదితర రకాలైన మొక్కలు ఈ పాటికే నర్సరీల్లో పంపిణీకి సిద్ధ్దం గా ఉన్నాయి. అటవీ శాఖ వారి వన నర్సరీలు, సామాజిక నర్సరీల్లో మరికొన్ని మొక్కలు పెంచుతున్నారు.