అది చెట్టు.. కాదు.. ఆయువు పోసే సంజీవని.. చల్లని నీడనిచ్చే తోడు… మన జీవనాధారం.. అంతే కాదు సమస్త ప్రాణకోటికి ఊపిరిపోసే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం. బాల్యంలో ఊగే ఊయ్యాల.. వృద్ధాప్యంలో ఊతకర్ర.. వరకు ఒంటికి బట్ట, కడుపునకు తిండి, పీల్చే గాలి ఇలా చెట్టు జీవితం మన జీవితంతో ముడిపడి ఉంటుంది. మనల్ని కాపాడే వృక్షాన్ని మనం కాపాడుకోవాల్సిన అనివార్యత వచ్చింది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మానవ మనుగడకు ముప్పు తప్పదు. ఇప్పుడు నగరంలో పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కరువవుతున్నది. మన వద్దే కాదు.. ప్రకృతిపై జరుగుతున్న దాడితో నేడు యావత్ ప్రపంచంలో పట్టణ కాలుష్యం జీవుల గుండెలకు చిల్లులు పెడుతున్నది. ఫ్లోరోక్లోరో కార్బన్ల వ్యాప్తి విస్తరిస్తున్నది.
కార్బన్డయాక్సైడ్ శాతం క్రమంగా పెరుగుతున్నది. వాతావరణ సమతుల్యత దెబ్బతిని.. జీవుల మనుగడ ప్రమాదంలో పడుతున్నది. మొక్కలు నాటడం.. చెట్లను పెంచడమే కాలుష్య నివారణకు.. పర్యావరణ పరిరక్షణకు మార్గం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నది. ఆరు విడతల్లో కోట్లాది మొక్కలు నాటగా, ఈ ఏడాది జూలై మొదటి వారంలో 7వ విడత ‘హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో కోటి పైచిలుకు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనివల్ల గ్రేటర్కు కొత్త ఊపిరి అందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో మొక్కల ప్రాధాన్యత..వాటి నుంచి ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్.. ఏ చెట్లు పెంచితే ఎక్కువ ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది..
‘ఒక మనిషి నిమిషానికి 300 ఎంఎల్, రోజుకు 0. 84 కేజీలు, ఏడాదికి 9.5 టన్నుల ఆక్సిజన్ పీల్చుకుంటాడు. అలాగే ఒక చెట్టు రోజుకు 388 క్యూబిక్ ఫీట్లు మేర, ఏడాదికి 100 కేజీల ప్రాణవాయువును విడుదల చేస్తుందని, భారీ వృక్షం 260 పౌండ్ల ఆక్సిజన్ను అందిస్తుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే వంద ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వ్యాసార్థం గల చెట్టు 48 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని 6 వేల పౌండ్ల ఆక్సిజన్ను విడుదల చేసే అవకాశం ఉంటుందంటున్నారు.
అతిపెద్ద వృక్షం విడుదల చేసే ఆక్సిజన్ను 9-10 మంది పీల్చుకోవచ్చని, సుమారు ఎకరం విస్తీర్ణం గల అటవీ ప్రాంతం 19-25 మందికి ఏడాది పాటు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్లో ఇలా మనం పీల్చుకోవడానికి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల చెట్లు కావాలో ఒక అంచనాకు రావచ్చు. అందుకే పరిమితి లేకుండా అవకాశం ఉన్న ప్రతి చోటా మొక్కలు నాటాలని ప్రభుత్వంతో పాటు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.”
న్యూయార్క్ సిటీకి శాశ్వత మాస్టర్ప్లాన్ రూపొందించిన సందర్భంలో ‘లంగ్ స్పేస్’ కోసం, పార్కుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. ఆ జాగాలను వాటి కోసమే వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితిలోనూ భూ వినియోగ మార్పిడికి అవకాశం లేకుండా మాస్టర్ప్లాన్కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు శివారులో తెలంగాణ ప్రభుత్వం రూ.కోట్లను వెచ్చించి వందల సంఖ్యలో అర్బన్ లంగ్స్ పార్కులను అభివృద్ధి చేసింది. దీంతో ఆహ్లాదంతో పాటు అత్యధిక ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ప్రజలకు చేరువయ్యాయి. నగర వాసులు సేద తీరేందుకు ఇప్పుడు ఇవి కేరాఫ్ అడ్రస్గా మారాయి. బాధ్యత గల పౌరులుగా మనమందరం చేయి చేయి కలిపి.. ‘హరిత’ ఆశయానికి తోడ్పాటునందించి.. మన నగరాన్ని ఆకుపచ్చగా మార్చుకునేందుకు కంకణబద్ధులవుదాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం.
ట్రంపెట్ వైన్, బాంబు పామ్, హైడ్రోంగియా, ఎంజెల్స్ ట్రంపెట్, లావెండర్, బెలూర్ ఫ్లవర్, హై బిస్కస్ లాంటి మొక్కలను నాటుతున్నారు. ఇవి పర్యావరణానికి ఏ మాత్రం దోహదం చేసేవి కాకపోగా, కొంతవరకు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రంగు రంగుల ఆకర్షణీయమైన చెట్ల ఆకులు, పువ్వులు రాలిపోయి చెత్తగా తయారవుతున్నదని, దీనిని కంపోస్ట్గా మార్చే వ్యవస్థ లేకపోవడంతో వాటిని కాల్చివేయడంతో విష రసాయనాలు, పొగ గాలిలో కలిసి కాలుష్యానికి కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామిడి, వేప, తులసి, రావి, వెదురు, మేడి, జువ్వి, మారేడు, కానుగ, సపోట, జమ్మి, మర్రి చెట్లు అత్యధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. హైబ్రిడ్ కాకుండా స్థానిక వృక్షజాతి మొక్కలను మాత్రమే ఎంచుకోవడం మేలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. హరితహారంలో భాగంగా వీటిని నాటితేనే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే రావి, వేప, కానుగ, మద్ది, లాంటి మొక్కలు పెంచితే వాటి ద్వారా అధిక ఆక్సిజన్ విడుదలకు ఆస్కారం ఉంటుందని, అవి అధికంగా కర్బన ఉద్గారాలను తీసుకుంటాయని వారంటున్నారు. ఇదిలా ఉంటే సూర్యరశ్మి లేకపోయినా… తులసి చెట్టు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని 24 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
కరోనా సోకి.. ఆక్సిజన్ స్థాయి పడిపోయి విలవిలలాడిపోయారు జనం. సిలిండర్లు వెంట పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రాణవాయువు ఎంత అవసరమో అర్థమైంది. ఇది అటుంచితే.. చెట్లు నరకడం ద్వారా పచ్చదనం తగ్గిపోయి.. స్వచ్ఛమైన గాలి అందకపోతే.. జరిగే నష్టం కూడా ఊహించలేం. సమస్త ప్రాణకోటి మనుగడే ప్రశ్నార్థమవుతుంది. అందుకే పచ్చదనాన్ని పెంచి.. విలయాన్ని నివారించాలని నిపుణులు పిలుపునిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా యావత్ తెలంగాణలో పచ్చదనం తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆకుపచ్చని తెలంగాణ కోసం హరితహారానికి అంకుర్పారణ చేశారు. ఏటా ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మరో 3 శాతం అడవులు పెరిగాయి. ఇక హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ఏటా సుమారు కోటి మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, వైద్యశాలలు, పారిశ్రామికవాడలు, ఖాళీ ప్రదేశాలన్నింటిలో మొక్కలు నాటే మహత్తర కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు కావాలి. మన భవిష్యత్ను మనమే కాపాడుకోవాలి.
హైదరాబాద్లో ఖాళీ స్థలాలు కరువైపోతున్నాయి. వెరసి చెట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నది. విస్తరిస్తున్న నగరంలో మొక్క నాటితే.. అది కొద్దికాలం ఉంటుందన్న నమ్మకం లేదు. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు రోజులకే నిర్మాణాలు వెలుస్తున్నాయి. పార్కులు, ఖాళీలు స్థలాలు, కొండలు, గుట్టలు అన్న తేడా లేకుండా అత్యంత వేగంగా భూమి వినియోగంలోకి వస్తున్నది. దీంతో నగరంలో నాటుతున్న మొక్కల జీవితకాలం 5 నుంచి 8 ఏండ్ల పాటే ఉంటున్నది.
మారేడ్పల్లి, జూలై 3: పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం మోండా డివిజన్ మారేడ్పల్లిలోని నెహ్రూనగర్ పార్కులో ఎమ్మెల్యే జి.సాయన్న, కార్పొరేటర్ దీపికతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ మంత్రిని కోరారు. కార్యక్రమంలో జడ్సీ శ్రీనివాస్ రెడ్డి, ఉప కమిషనర్ ముకుందరెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పల్లెప్రగతిలో భాగంగా పబ్లిక్ గార్డెన్లో శనివారం శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావుతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, టీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్, నాయకులు సంజయ్, ప్రదీప్కుమార్ అగర్వాల్, లక్ష్మీనారాయణ, మెట్టు నట్రాజ్ తదితరులు పాల్గొన్నారు -మెహిదీపట్నం జూలై 3
ఘట్కేసర్, జూలై 3:పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్లో చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కమిషనర్ వసంత, కౌన్సిలర్లు సంగీతా ప్రభాకర్ రెడ్డి, వెంకట్రెడ్డి, రమాదేవి, ఆంజనేయులు, అనురాధ, శశికళ, మల్లేశ్, ,జాంగీర్, నరేశ్యాదవ్, నర్సింగ్రావు, నరేందర్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా, జూలై 3: పట్టణ ప్రగతి కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. శనివారం కాప్రాలో ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి హరితహారం, పారిశుధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాప్రాకు వచ్చే దారిలో, వీధుల్లో చెత్తకుప్పలు, అపరిశుభ్రత కనిపించాయని అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని డీసీ శంకర్ను ప్రశ్నించారు. వారం రోజుల్లో పరిస్థితి మారాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా సాయిబాబా, ఆఫీసర్స్కాలనీ, సాయిపురి కాలనీల్లో మొక్కలు నాటారు. అనంతరం సాయిబాబానగర్లో డబుల్బెడ్రూం ఇండ్లను మేయర్ పరిశీలించారు. పట్టణ ప్రగతి బుక్లెట్ను ఎమ్మెల్యేతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్సీ ఉపేందర్రెడ్డి, డీసీ శంకర్, కార్పొరేటర్లు స్వర్ణరాజు, జె.ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, ఈఈ కోటేశ్వర్రావు, డీఈఈ బాలకృష్ణ, ఏఈఈలు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.