పచ్చదనంతోనే మనిషి జీవితం.. మనుగడ కొనసాగాలన్నా, భావితరాలు భద్రంగా ఉండాలన్నా పచ్చదనమే ప్రధానం. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం ఏడేండ్లుగా నిర్విఘ్నంగా సాగుతోంది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు హరిత నిధి (గ్రీన్ఫండ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, విద్యార్థి నుంచి పింఛన్దారుడి వరకు ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేస్తున్నారు. పైసలెన్ని ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఈ పచ్చనికార్యంలో తమ పాత్ర కూడా ఉందని భావన కలిగించడమే హరిత నిధి సంకల్పం. ఈ బృహత్ కార్యంపై గ్రేటర్వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ హరిత నిధిని ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు.. ఒక్కరేమీ సబ్బండ వర్ణాలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు సమాయత్తమవుతున్నారు. శక్తి మేరకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఎంతో దూరదృష్టితో 2015 జూలైలో ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ ఏడేండ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నది.
ప్రధానంగా పర్యావరణహితంగా, పచ్చని నగరంగా హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏడో విడత హరితహారం తుది దశకు చేరుకోగా, ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు కలిసి సుమారు 14 కోట్ల మొక్కలు నాటారు. తద్వారా సామాజిక ఆడవుల పెంపకం, అర్బన్ పార్కుల అభివృద్ధిలో హైదరాబాద్ విశేష ప్రగతిని సాధించింది. ప్రతి ఏటా ఓ యజ్ఞంలా సాగిన హరితహారంలో నగరంతో పాటు ఔటర్ రింగ్రోడ్డు పచ్చని లోగిలిలా మారింది.
ఖైరతాబాద్, అక్టోబర్ 3: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితనిధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. ఆదివారం మహారాజ్ అగ్రసేన్ జయంతి మహోత్సవ్ సందర్భంగా అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన ట్రెజర్ హంట్ కార్యక్రమాన్ని పీపుల్స్ప్లాజా వద్ద ప్రారంభించారు. గో గ్రీన్, గో కరోనా, డ్రైవింగ్ సేఫ్టీ నినాదాలతో నిర్వహించిన ఈ ర్యాలీని ప్రారంభించిన మేయర్ అనంతరం మాట్లాడుతూ వాతావరణ సంక్షోభంతో భూతాపం పెరిగితే మనవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారడం ఖాయమన్నారు.
హరిత తెలంగాణను సాధించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పర్యావరణవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థలు కలిసి రావాలన్నారు. హైదరాబాద్ను క్లీన్, గ్రీన్ సిటీగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని.. ఇందులో భాగంగానే హరిత నిధిని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ నిధికి ఇచ్చే ప్రతి రూపాయి పచ్చదనం పెంచేందుకు ఉపయోగిస్తామని అన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అంజనీకుమార్ అగర్వాల్ మాట్లాడుతూ హరిత నిధిని తమ సంస్థ స్వాగతిస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగస్వాములమై ప్రతి ఆదివారం నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతామని వివరించారు. తెలంగాణ హరితనిధికి లక్ష రూపాయలు ప్రకటించారు. త్వరలోనే ఈ నిధిని ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ సభ్యులు అంకిత్ గుప్తా, ఆశిష్, నవీన్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాహుల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అగర్వాల్ సమాజ్ చేపట్టిన కార్ల ర్యాలీ సృజనాత్మకతకు అద్దం పట్టింది. కార్లలోని డాష్ బోర్డు, పైన, వెనుక పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనాన్ని సూచిస్తూ పలు రూపాలను ఏర్పాటు చేశారు. సుమారు 123 కార్లతో ఈ ర్యాలీ నిర్వహించారు.
జవహర్నగర్/మన్సూరాబాద్, అక్టోబర్ 3 : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా చేపట్టిన రాష్ట్రంలోని ‘గుడిగుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమం చాలా గొప్పదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం జవహర్నగర్ కార్పొరేషన్లోని వెంకటేశ్వరకాలనీలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో, నాగోల్ డివిజన్ పరిధి శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీసాయిబాబా దేవాలయం ప్రాంగణంలో ఆయన జమ్మిచెట్లు నాటారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా, కార్పొరేటర్లు గొడుగు వేణు, జమాల్పూర్ నవీన్కుమార్, కృష్ణగౌడ్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ మహేశ్గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ సాదిక్, ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పెద్ది శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ భువనగిరి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ జీవీఎస్ఎస్ శర్మ,లక్ష్మారెడ్డి, రఘురాంరెడ్డి, రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లు, ఎవెన్యూ ఫ్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటగా ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020’ గుర్తింపు లభించింది. అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో ప్రపంచంలోనే ఇతర నగరాలకు ఆదర్శవంతంగా హైదరాబాద్ నిలువడం ఎంతో అభినందనీయమని అర్బన్ డే ఫౌండేషన్ అధ్యక్షులు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న హరితహారానికి ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. తెలంగాణ పుడమితల్లికి పచ్చని బొట్టుపెట్టే ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా. నా వంతుగా నెలనెలా కొత్త మొత్తాన్ని హరితనిధికి జమ చేస్తా. హరిత ఉద్యమంలో ప్రతిఒక్కరినీ మమేకం చేయడం చారిత్రాత్మకం. – విష్ణు ప్రదీప్, సీనియర్ డైరెక్టర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్
పచ్చదనం పెంపొందించడానికి హరితనిధి ఏర్పాటు చేస్తున్నట్లు మంచి నిర్ణయం ప్రకటించిన సీఎం కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే పచ్చదనంపై ప్రజలకు అవగాహన పెరిగింది.
హరితనిధికి విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. – రెక్కల కొండల్ రాజు, తెలంగాణ కురుమ సంఘం ఉపాధ్యక్షుడు
హరిత నిధిని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ యజ్ఞంలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ప్రభుత్వ పథకాల్లో ఉద్యోగులకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును ఆనందంగా స్వీకరిస్తాం. – డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేన్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు
హరిత నిధితో తెలంగాణ పచ్చగా మారడం ఖాయం. భవిష్యత్ తరాలకు పచ్చని కానుక అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా హరితహారాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కార్యక్రమంలో ఉద్యోగులు భాగస్వామ్యం అవుతున్నారు. ఉద్యోగులతో ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. – ముత్యాల సత్యనారాయణ, బీటీఎన్జీవో సైసొటీ అధ్యక్షుడు
హరిత నిధిని ఏర్పాటు చేసి అందులో ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉంది. హరిత తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్కి హ్యాట్సాప్. ఉద్యోగుల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఈ ప్రభుత్వం వెంట నడవడం ఆనందంగా ఉంది. – ఎంబీ కృష్ణయాదవ్, టీజీవో జిల్లా అధ్యక్షుడు
దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన హరితహారంలో ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషంగా ఉంది. హరితనిధికి నా వంతు సాయం చేస్తా. -చంద్రేశేఖర్, టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి
పచ్చదనం పెంచేందుకు హరితనిధిని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రథమంగా సీఎం కేసీఆర్ వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టారు. పల్లె, పట్టణ వనాలతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. హరితనిధిలో భాగస్వామ్యమై నా వంతు సహకారం అందిస్తా. – వేదకుమార్, చైర్మన్, ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్
ఆకుపచ్చని తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ దిక్సూచిగా మారారు. ఊరూ, వాడలో హరితహారం ఉద్యమంగా జరుగుతుంది. దీనికి మా వంతుగా ప్రతి ఒక్కరూ నిధిని ఏర్పాటు చేసుకుని బాధ్యతను గుర్తెరిగితే..భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాం. మణికొండ మున్సిపాలిటీలో హరితనిధి ఏర్పాటుకు చొరవచూపుతాం. -ప్రమోద్రెడ్డి, పర్యావరణ ప్రేమికుడు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాదు…వాటి పరిరక్షణకు బాధ్యతను గుర్తెరుగాలి. ప్రభుత్వం సంకల్పించిన హరిత నిధికి నా వంతు సహకారం అందిస్తా. ఇతరులలో అవగాహన కల్పిస్తాం. అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.-నరసింహ రాజు, డీఈ, నార్సింగి మున్సిపాలిటీ
రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సీఎం కేసీఆర్ శాసనసభలో హారితనిధి ప్రకటన చేయడం చాలా బాగుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను కూడా హరితనిధిలో పాలుపంచుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. -ఉమేశ్ రావు, బొల్లారం
రాష్ట్రంలో అడవులను పెంచాలని సీఎం కేసీఆర్ ఈ మంచి పనికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణలో హరితహారం ప్రపంచంలోనే మూడోఅతిపెద్ద కార్యక్రమం. ఇది తెలంగాణకు దక్కిన గౌరవం. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయడం గొప్ప విషయం.-అనిల్, వ్యాపారవేత్త, బొల్లారం
సీఎం కేసీఆర్ రూపొందించిన ‘హరిత నిధి’ మొక్కుబడి కార్యక్రమంగా మిగిలిపోరాదు.. దీనిని ఓ మహోద్యమంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉంది. రాజకీయాలకు తావు లేకుండా గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ ‘హరిత నిధి’ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. – పార్థసారధి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, ఎస్ఆర్నగర్
‘హరిత నిధి’ అంటే నిధుల సమీకరణ మాత్రమే కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. భూతాపాన్ని తగ్గించే దిశగా జరుగబోయే మహోద్యమం. ఈ మహోద్యమాన్ని దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి హరితనిధి కార్యాచరణను ముందుకు నడిపించాలి. ప్రభుత్వాలు మారినా.. సీఎం కేసీఆర్ హరితనిధి సంకల్పం ప్రజల జీవన విధానంలో ఇది ఒక భాగం కావాలి. – కొండ్రాజు సుబ్బరాజు, గ్రీన్ సిటీ హోమ్స్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితనిధి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేయడం దేశ చరిత్రలో మరిచిపోలేనిది. హరితహారం ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించేందుకు హరితనిధి దోహదపడుతుంది. తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం అభినందనీయం. – కట్టంగూర్ హరీశ్రెడ్డి, చర్లపల్లి పారిశ్రామికవాడ ఐలా చైర్మన్
హరితనిధి సమకూర్చే క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు వసూలు చేసే జరిమానాలు అటువైపు మళ్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలు, కళాశాలల్లో సంవత్సరానికి రెండు సార్లు మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేయాలి. రిజిస్ట్రేషన్ల సమయంలో హరితనిధి కోసం వసూలు చేసే మొత్తానికి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి.- ప్రొఫెసర్ బాలకిషన్, డీన్, ఉస్మానియా యూనివర్శిటీ
ప్రకృతి బాగుంటేనే అందరం బాగుంటామని గుర్తించిన సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. దీన్ని కొనసాగించాలంటే ప్రజలు స్వచ్ఛందంగా హరితనిధి ఇచ్చేందుకు ముందుకు రావాలి. జల్పల్లిలో అమన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జూన్లో మొక్కలు నాటుతున్నాం. – సయ్యద్ ఇద్రీస్, జల్పల్లి అమన్ యూత్ సభ్యుడు
సీఎం కేసీఆర్ తీసుకున్న హరితనిధి మంచి నిర్ణయం. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ తరఫున మావంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్జీసీ కింద పాఠశాలలకు రూ.5వేలు ఇస్తున్నారు. దీన్ని రూ.10వేలకు పెంచాలి. – రంగాచారి, గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్, రాష్ట్ర కౌన్సిలర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం హరిత నిధితో భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం తప్ప ఒక్క మొక్కను నాటలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే అటవీ సంపద పెరుగుతోంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హరితనిధిని ప్రవేశపెట్టడం అద్భుతమైన నిర్ణయం. – సీహెచ్ జీవన్రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త, ఘట్కేసర్
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హరితనిధిని ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఘట్టం. దేశంలో మరెక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో విభిన్న నూతన ఆవిష్కరణలు, పథకాలు ప్రవేశపెట్టి మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణను ముందువరుసలో నిలుపడం హర్షణీయం. – రాగం సుజాత నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్
దేశంలోనే ప్రథమంగా హరితనిధిని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయం. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాదు. సమాజంలోని ప్రతి పౌరుడు మొక్కల పెంపకం, వన సంరక్షణకు నడుం బిగించాల్సిన అత్యంత అవసరమైన పరిస్థితి నెలకొంది. దేశంలోని అన్ని రాష్ర్టాలు ఈ దిశగా అడుగులు వేయాలి. – చిట్టెడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఇది ఆరోగ్య తెలంగాణకు బాసటగా నిలుస్తుంది. హరితనిధిలో అందరినీ భాగస్వాములను చేయడం గొప్ప విషయం. ప్రకృతి పచ్చగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటాం. – నాగమణి, శాంతినగర్
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ప్ర భుత్వ శాఖల అధికారులతో పాటు సామాన్యులను కూడా భాగస్వాములు చేయడం శుభపరిమాణం. ఇలాంటి మంచి కార్యక్రమాలకు విరాళాలు అందిస్తాం. – దూసరి శ్రీనివాస్ గౌడ్, పాత నగర కల్లుగీత కార్మిక సంఘం నాయకుడు
రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని మ రింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేయడం అభినందనీయం. మొక్కల పెంప కం, సంరక్షణకు హరితనిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. – ఎంపెల్లి పద్మారెడ్డి, శివసాయినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
హరితహారంతో పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది. శ్రీరామకాలనీలో ప్రతి ఇంటికి నాలుగు మొ క్కలను అందజేశారు. నేను కూడా మొక్కల పంపిణీలో భాగస్వామిని అయ్యాను. హరితనిధిలోనూ భాగస్వామినవుతా.. ఇది నాకు గర్వకారణం. – వాసుబాబు (మాజీ సైనికుడు) శ్రీరామకాలనీ