ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన మత్స్యశాఖ
త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి
ఖమ్మం వ్యవసాయం, జూలై 13: తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉన్నచోట ఉపాధి కల్పించి.. ఆర్థిక భరోసా కల్పిస్తుండడంతో వలసెల్లిన వారు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మత్స్యకార్మికుల కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టడంతో వారి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. ఇందులో భాగంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీతోపాటు మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలను అందిస్తున్నది. అంతేకాదు, మత్స్య కార్మికుల భద్రతకు బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ పరిధిలోని పాలేరు, వైరా, లంకాసాగర్, బేతుపల్లి రిజర్వాయర్తోపాటు 197 చెరువులు, పంచాయతీల పరిధిలో 762 కుంటలు ఉన్నాయి. వీటిలో వదిలేందుకు 3.90 కోట్ల చేపపిల్లలు అవసరం ఉంటుందని మత్స్యశాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ తర్వలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. అనంతరం చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా క్రమపద్ధతిలో చేపలను పంపిణీ చేయనున్నారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడుతుండడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరోమారు ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా మత్స్య కార్మికులు, చెరువుల విస్తీర్ణం పరిగణంలోకి తీసుకొని చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. రాష్ట మత్స్యశాఖ జిల్లాకు అవసరమయ్యే చేప పిల్లలకు సంబంధించిన ప్రణాళిక తయారు చేసి జిల్లా కార్యాలయానికి చేరవేసింది. రెండు రకాల సైజులు, నాలుగు రకాల పిల్లలు కలిపి ఈ ఏడాది సుమారు 3.90 కోట్ల చేపపిల్లలు అవసరమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. గడిచిన నాలుగేండ్లుగా మత్స్య పారిశ్రామిక కార్మికులను ఆదుకునేందుకు టీ సర్కార్ అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. చేపలవేట సాగించే మత్స్య కార్మికుల భద్రతకు బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలను అందిస్తున్నది. వీటితోపాటు మత్స్య సొసైటీల బలోపేతమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వందల కోట్ల రూపాయలను వెచ్చించి ఉచితంగా చేప పిల్లలను మత్స్య కార్మికులకు అందించే ప్రక్రియ నాలుగు ఏళ్లుగా అమలు చేస్తున్నది. దీంతో కార్మికులకు పెట్టుబడి లేకుండా పోయింది. ఈ ఏడాది మరోమారు చేపపిల్లల పంపిణీకి జిల్లా మత్స్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ పరిధిలోని పాలేరు, వైరా, లంకసాగర్, బేతపల్లి రిజార్వయర్తోపాటు 197 చెరువులున్నాయి. గ్రామపంచాయతీల పరిధిలో 762 కుంటలు ఉన్నాయి. వీటిసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటిలో ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు 3.90 కోట్ల చేపపిల్లలు అవసరం ఉంటుందని అంచనా వేశారు. చేప పిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్ ప్రక్రియ వారం రోజుల వ్యవధిలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. అనంతరం చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా క్రమపద్ధతిలో చేపలను పంపిణీ చేయనున్నారు.
టెండర్ ప్రక్రియ ఏర్పాట్లు..
ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన కార్యాచరణ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను రాష్ట మత్స్యశాఖ తయారు చేసింది. చేప పిల్లల ఉత్పత్తిదారుల నుంచి పంపిణీ చేపట్టేందుకు సర్కార్ ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. వారం, పది రోజుల్లోగుత్తేదారుల ఎంపిక పూర్తి కానున్నది. అనంతరం జిల్లా మత్స్యశాఖ మరోమారు పంపిణీకి సంబంధించిన యాక్షన్ప్లాన్ తయారు చేయనున్నది. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో గడిచిన రెండు, మూడురోజుల నుంచి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల చెరువుల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నెల చివరి వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, చెరువుల్లో నీటినిల్వలను బట్టి చేప పిల్లల పంపిణీ చేయనున్నారు. దాదాపు ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన చెరువుల్లో ఉచిత చేప పిల్లలను వదిలేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన చేపపిల్లలతో నేటి వరకు చెరువుల, కుంటలు మత్స్య సంపదతో కళకకళలాడుతున్నాయి.
14వేల కుటుంబాలకు ప్రయోజనం
ఉచిత చేప పిల్లల పంపిణీతో ఏటా జిల్లావ్యాప్తంగా 14, 683 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతున్నది. జిల్లా వైశాల్యం, నీటి వనరులతో పోల్చుకుంటే మత్స్యసంపద జిల్లా వాసులకు తగ్గట్టుగానే ఉంది. సాధారణంగా సగటున సంవత్సరానికి ప్రతి మనిషికి 8 నుంచి 12కిలోల చేపల అవసరం ఉంటుందని నిపుణుల అంచనా. జిల్లాలో వర్షాలు వచ్చిన సంవత్సరంలో ఏటా 20 వేల టన్నుల మత్స్య ఉత్పత్తి జరుగుతున్నది. జిల్లా మొత్తం మత్స్యపరిశ్రమ పై ఆధారపడి 14.683 మంది కార్మికులు చేపలవేటను కొనసాగిస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో183 సొసైటీలున్నాయి. మత్స్యకార్మికులు చెరువులు, కుంటలు, పాలేరు, వైరా, లంకసాగర్, బేతపల్లి రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా 3వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీతోపాటు మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రత్యేక రాయితీలతో జిల్లా మత్స్యకార్మికులకు సుమారు రూ.38 కోట్లతో వలలు, తెప్పలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, డీసీఎంలు, అవుట్ లెట్లను అందించారు.