హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఏడాది క్రితం లాక్డౌన్ ముగిసిన తొలినాళ్లలో కిలో రూ.300 పలికిన చికెన్ ఈ ఏడాది ఎండాకాలం ప్రారంభంలోనే కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ రూ.300, కోడి గుడ్డు రూ.5 నుంచి రూ.5.30 పలుకుతున్నది. పెరిగిన ధరలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. చికెన్, కోడిగుడ్డు ధరలు పెరిగినా పౌల్ట్రీ రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. కోళ్ల దాణా ధరలు, వేసవి తీవ్రత పెరగడమే దీనికి కారణమని ఎన్ఈసీసీ (నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ) నిపుణులు చెప్తున్నారు.
కోళ్ల దాణా ధరలు నెలరోజుల్లోనే 30 శాతానికి పైగా పెరిగాయి. మొన్నటివరకు కిలో మొక్కజొన్న రూ.15 నుంచి రూ.16 ఉండగా ప్రస్తుతం రూ.18కి చేరింది. సోయా కూడా రూ.30-35 నుంచి ఏకంగా 65కు చేరింది. వీటితోపాటు దాణాలో వినియోగించే డీవోఆర్పీ, జీఎన్సీ, పొద్దుతిరుగుడు కేక్, జొన్నలు, సజ్జల ధరలు సైతం 30 శాతం నుంచి 35 శాతం పెరిగాయి. దీనికితోడు కోడిపిల్లల ధరలు కూడా పెరిగాయి. రెండునెలల క్రితం వరకు రూ.45 ఉన్న బాయిలర్ కోడిపిల్ల ప్రస్తుతం రూ.56కు చేరింది. హేచరీ లేయర్ కోడిపిల్లలు గతేడాది డిసెంబర్లో రూ.39 ఉండగా ఇప్పుడు రూ.43కు పెరిగాయి.
వేసవి తాపం, రోగాలు వస్తున్నాయనే ప్రచారంతో రైతులు తక్కువ బ్యాచ్లు వేస్తుండటంతో ఉత్పత్తి భారీగా తగ్గింది. ఉష్ణ్రోగ్రతలు 38 డిగ్రీలు దాటడంతో 45 రోజుల్లో రెండు కిలోలు రావాల్సిన కోడి బరువు కిలో, కిలోన్నర మాత్రమే వస్తున్నది. లేయర్ కోళ్లు గడ్లు తక్కువగా పెడుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 3.7 కోట్ల గుడ్లు ఉత్పత్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం 3.1 కోట్ల నుంచి 3.2 కోట్ల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. డిమాండ్లో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు. మొత్తం ఉత్పత్తి అవుతున్న గుడ్లలో 1.8 కోట్లు ప్రతిరోజు మనరాష్ట్రంలోనే వినియోగిస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు సరఫరా కాస్త తగ్గింది.
కరోనా తొలినాళ్లల్లో చికెన్, కోడిగుడ్లు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కోడికూర తినాలని సూచించారు. దీంతో కష్టాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ తిరిగి పుంజుకున్నది. చికెన్, గుడ్లకు డిమాండ్ భారీగా పెగిరింది. పైగా ఇప్పుడు ధరలు పెరిగాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నా పౌల్ట్రీ రైతులను మాత్రం శని వదలడం లేదు. ముడిసరుకుల ధరలు పెరగడం వారిని కోలుకోనివ్వడం లేదు. రాష్ట్రంలో పౌల్ట్రీరైతులు బాయిలర్లో 22 వేల మందికిపైగా, లేయర్లో రెండున్నర వేల మంది మొత్తం కలిపి సుమారు 25 వేల మంది ఆధారపడి ఉన్నారు. బాయిలర్లో దాదాపు 85 శాతం ఫాంలు కంపెనీల ఆధీనంలో నడుస్తున్నాయి. పిల్లల నుంచి ఫీడింగ్ మొత్తం వారే సరఫరా చేసి రైతుకు ధర చెల్లించి తీసుకెళ్తున్నారు. లేయర్లో చాలావరకు ప్రైవేటు వ్యక్తులు, రైతులు ఆధీనంలో ఉన్నాయి.