రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న పిల్లలందరి ఆరోగ్యాన్ని స్క్రీన్ చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ (హెల్త్ మానిటరింగ్) కార్డులు ఇచ్చే బృహత్తర కార్యానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రంగం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి మొదలైన ఈ ప్రక్రియను రాష్ట్రంలోనే మొదటగా హైదరాబాద్ జిల్లా అధికారులు పూర్తి చేయడం విశేషం. సంక్షేమ శాఖ అధికారులు, అంగన్ వాడీ కేంద్రాల సిబ్బంది సమష్టిగా సమన్వయంతో ముందుకు సాగారు. ముందస్తు ప్రణాళికతో స్వల్ప వ్యవధిలోనే హైదరాబాద్ జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 98,681 మంది చిన్నారులకు సంబంధించి స్క్రీనింగ్ పూర్తి చేశారు. వారి వయస్సు, ఎత్తు, బరువు తదితర వివరాలను నమోదు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 1,28,529 మంది చిన్నారులకు గాను ఇప్పటివరకు 1,18,960 మంది చిన్నారుల (92.55 శాతం) వివరాలను నమోదు చేశారు. వికారాబాద్ జిల్లాలో 52,689 చిన్నారులకు గాను, 47,198 మంది (89.58 శాతం) వివరాలను నమోదు చేశారు. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1,17,752 మంది చిన్నారులకు గాను 1,02,196 మంది (86.79 శాతం) వివరాలను నమోదు చేశారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో డ్రైవ్ కొనసాగుతుండగా, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రస్తుతం ఆ నివేదికను మదింపుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎంత మంది చిన్నారుల్లో వయస్సుకు తగిన ఎదుగుల, ఎత్తుకు తగిన బరువు ఉన్నారో అనే లెక్కలను గణిస్తున్నారు.