సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ) : వానకాలం ఆరంభంలోనే ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు భూగర్భజలాలను తట్టిలేపాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పాతాళగంగ ఉబికివచ్చింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో అన్ని మండలాల్లోనూ రికార్డు స్థాయిలో భూగర్భజలాలు ఎగబాకాయి. ఈ ఏడాది జూన్ నుంచి జూలై చివరి నాటికి పోల్చితే సరాసరిగా 3.71 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గతేడాది జూలై ఈ ఏడాది జూలై నెలతో పోల్చితే మొత్తంగా 1.51 మీటర్ల మేర పెరిగినట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు తెలిపారు. కాగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 1 నుంచి జూలై 28 వరకు నగరంలో 260.9 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని అంచనా ఉండగా, 397.1 మిల్లీమీటర్ల మేర కురిసింది. అంటే 52 శాతం మేర అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ తాగునీటి రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా ఆసిఫ్నగర్, మాసబ్ట్యాంక్, చార్మినార్, సైదాబాద్, ఆమీర్పేట, ఖైరతాబాద్, మారేడ్పల్లి మండలాల్లో భారీగా వర్షాపాతం నమోదు కావడంతో ఈ ప్రాంతాల్లో భారీగా భూగర్భజలాలు పైకి ఎగబాకాయి. మిగతా మండలాల్లో బోర్ల వాడకం ఎక్కువగా ఉండటం.. వరద నీరు ఇంకే మార్గం లేకపోవడంతో భూగర్భజలాలు పెరుగకపోవడానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.