హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆడబిడ్డ, టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికే జై కొట్టినట్లు తెలుస్తున్నది. మహిళలు, పట్టభద్రులు, ఉద్యోగులు ఇలా సబ్బండ వర్గాల మద్దతును కూడగట్టడంలో ఆమె సఫలీకృతమైనట్లు తేటతెల్లమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆమె గెలుపు నల్లేరు మీద నడకలా మారిందని గులాబీశ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పెరిగిన ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనమని వారు వివరిస్తున్నారు. గెలుపు ఏకపక్షమేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారిగా బరిలో నిలిచిన టీఆర్ఎస్, మహిళా అభ్యర్థి సురభి వాణీదేవిని మహిళలు అక్కున చేర్చుకున్నారు. ఆమె స్వతహాగా విద్యావేత్తనే గాకుండా, చిత్రకారిణి కావడంతో ఎక్కువ శాతం ఆమెవైపే మొగ్గుచూపినట్లు పలువురు మహిళలు వెల్లడించారు. స్వతహాగా విద్యారంగంలోని మహిళల సమస్యలపై ఆమెకు అవగాహన ఉండటంతో, తప్పకుండా ఆ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావిస్తారనే బలమైన నమ్మకాన్ని మహిళా లోకం వ్యక్తం చేసింది. దీంతో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుతో తమ మద్దతు తెలిపారు. టీఆర్ఎస్.. మహిళా విద్యాభివృద్ధికి, రక్షణకు పెద్దపీట వేస్తుండటం, రాజకీయాల్లో సముచితస్థానం కల్పించడం వంటి అనేక సానుకూలాంశాలు కూడా వాణీ దేవికి మొగ్గుచూపడంలో ప్రధాన పాత్రను పోషించాయని పలువురు ఆడబిడ్డలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి ఉద్యోగులు, పట్టభద్రులు కూడా జేజేలు పలికారు. భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటన, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై వారు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా తరలివచ్చి కారుకే మద్దతుగా ఓటు చేసినట్లు పలువురు పట్టభద్రులు, ఉద్యోగులు వెల్లడించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పెనుభారం మోపడంతో ప్రతి ఒక్కరిలోనూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. అదీగాక కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించడంపైనా ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ఓటింగ్లో పాల్గొన్నట్లు పలువురు ఉద్యోగులు వెల్లడించడం గమనార్హం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రాడ్యుయేట్ల పేర్ల నమోదు నుంచి పోలింగ్ ముగిసేవరకు గులాబీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థి వాణీదేవికి అన్నివిధాలుగా అండగా నిలిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు మొదలుకొని క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలు సైతం ఎక్కడికక్కడ పట్టభద్రులను నేరుగా కలిసి మద్దతును కూడగట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ఓటర్ల మనసులను గెలుచుకున్నాయి. పోలింగ్ ప్రక్రియలో టీఆర్ఎస్ శ్రేణులు కీలకపాత్రను పోషించారు. గెలుపే లక్ష్యంగా అవిశ్రాంతం గా కృషి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి పెరిగిన ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనమని, అది మిగతా అభ్యర్థులకన్నా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికే ఎక్కువ లాభిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.