హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): విద్యతోనే సమానత్వం సాధ్యమని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. “కొవిడ్ అనంతరం ప్రపంచంలో పాఠశాల విద్య భవిష్యత్తు” అనే అంశంపై సీఐఐ తెలంగాణ, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం “స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కన్క్లేవ్” నిర్వహించారు. వర్చువల్గా జరిగిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని డిజిటల్ డివైడ్ (వ్యత్యాసం)ను రూపుమాపినప్పుడే వెనుకబడిన విద్యార్థులు తమ చదువును కొనసాగించడం వీలవుతుందన్నారు.
సామాజిక ఆర్థిక స్థితిగతులకు అతీతంగా అందరికీ సమానమైన విద్యను అందించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ, వస్తువులు లేని కారణంగా ఆన్లైన్ విద్యను తిరస్కరించే పరిస్థితి రావొద్దన్నారు. సీఐఐ తెలంగాణ చైర్మన్ సమీర్ గోయెల్, కన్క్లేవ్ కన్వీనర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సాలార్జంగ్ మ్యూజియానికి ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం మ్యూజియంలో నిర్వహించిన బోర్డు సమావేశానికి బోర్డు చైర్మన్ పర్సన్ హోదాలో ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యూజియంలో భద్రపరిచిన వస్తువులు గత వైభవాన్ని తెలుపుతున్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, సాలార్జంగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.