హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా శాస్త్రవేత్తలు ముందుండి నడిపించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. సీఎస్ఐఆర్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 78వ ఆవిర్భవ వేడుకల్లో గురువారం పుదుచ్చేరి నుంచి గవర్నర్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ. 50 వేల కోట్ల భారీ నేషనల్ రీసెర్చ్ ఫండ్ (ఎన్ఆర్ఎఫ్) ఊహించని స్థాయిలో దేశంలో పరిశోధనలను ప్రోత్సహిస్తుందన్నారు. ఇప్పటికీ మన దేశం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు (ఏపీఐ)ల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతుందన్నారు. ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచ ఫార్మా రాజధానిగా నిలపాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ సమయంలో దేశీయ వ్యాక్సిన్, డ్రగ్స్ తయారీలో సీఎస్ఐఆర్-ఐఐసీటీ చేసిన కృషిని అభినందించారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండే, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.