సిటీ బ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్ : పూర్వీకులకు సంబంధించిన కళలు, సంస్కృతి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివాసీ, గిరిజన, జానపదులు వినియోగించిన పలు వాయిద్య పరికరాలు, కళారూపాలు, వివిధ ఆకృతులను ఒక్కచోట చేర్చి సందర్శకులకు అవగాహన కల్పించడం హర్షణీయమని గవర్నర్ పేర్కొన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్య కళ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆదివారం గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సోమవారం నిర్వహించే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రదర్శనలోని వాయిద్య సాధనాలు, విగ్రహాలు, వివిధ ఆకృతులు, చిత్రాలను భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. గిరిజన ఆదివాసీల ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, తండాలు, చెంచు గూడేల పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను వ్యాక్సిన్పై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించారని, వారు ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించేందుకు ఆయా విభాగాలు కృషి చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్, పాలమూరు యూనివర్శిటీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ గూడూరు మనోజ, ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్రావు తదితరులు పాల్గొన్నారు.