మేడ్చల్ రూరల్, జూలై 31: వైద్య వృత్తి అతి పవిత్రమైనదని గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. మేడ్చల్ మండలం రాజబొల్లారం పంచాయతీ మెడిసిటీ వైద్య కళాశాలలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యవృత్తిని వ్యాపారంగా కాకుండా సామాజిక దృక్పథంతో నిర్వహించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో వైద్య వృత్తి వ్యాపారంగా మారిందన్న భావన ఉందని తన అనుభవాలను వివరించారు. ఇది పోయేలా యువ డాక్టర్లు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలనే ప్రకటన రావడం హర్షణీయమని గవర్నర్ అన్నారు. పేదల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని ఆమె కొనియాడారు. యువ డాక్టర్లు రోగుల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించడమే కాకుండా తమ మానసిక, ఆరోగ్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. సమాజంలో వైద్యులుగా అడుగుపెట్టే విద్యార్థులు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంపాదించాలన్నారు. అనంతరం చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు ప్రదానం చేశారు. మైనంపల్లి రోహిత్ (మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు) రెండు బంగారు పతకాలను, అపూర్వ, రావ్లీన్ చెరో బంగారు పతకాన్ని సాధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ శైలేంద్ర, డాక్టన్ ఇనాక్షి గంగూలీ తదితరులు పాల్గొన్నారు.