ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
కేటీఆర్ బహిరంగ సభా ఏర్పాట్ల పరిశీలన
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 13: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.17.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు పట్టణ ప్రజలు, టీఆర్ఎస్శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ సాయంత్రం 3:30 గంటలకు పట్టణానికి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం 4:30గంటలకు సభలో పాల్గొంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న సందర్భంగా పట్టణంలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభర్థుల కోసం అనుభవం కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన బోధనను అందించేందుకు ఆన్లైన్ శిక్షణ యాప్ను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం విపక్షాలు అసత్యపు ప్రచారాలు చేయడం తగదని విమర్శించారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు సహకరించి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ తులసీరాం, నర్సింహాగౌడ్, రాజేశ్వర్రెడ్డి, నరేశ్, నిజాం, ఖలీల్, ఉస్సేన్ తదితరులు ఉన్నారు.