సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నాడు సర్కార్ బడులకు పోను నాయనో.. అన్న విద్యార్థులు నేడు సర్కార్ బడికైతేనే పోతా అంటున్నారు.. అప్పుడు ఎన్ని ఫీజులైనా ప్రైవేటుకే పంపిస్తామన్న తల్లిదండ్రులు.. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సర్కార్ కల్పిస్తున్న వసతులను చూసి.. ప్రైవేటులో ఫీజులెందుకు దండుగా.. సర్కార్ బడులుండగా అంటున్నారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
మొదట్లో ప్రభుత్వ బడుల్లో 40.10శాతం వరుకు హాజరు నమోదైంది. కాని ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం ఇందుకు భిన్నంగా కేవలం 29.22శాతం మాత్రమే విద్యార్థుల హాజరు నమోదైంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 45 శాతానికి హాజరు పెరుగగా.. ప్రైవేటు పాఠశాలల్లో ఏ మాత్రం పెరుగలేదని జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన రిపోర్టు ద్వారా తెలుస్తుంది.
దసరా సెలవులు పూర్తి కాకపోయినా.. సొంత ఊర్ల నుంచి ఇంకా హైదరాబాద్కు పూర్తి స్థాయి కుటుంబాలు రాకపోయినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం 34.88 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. కాని ప్రైవేటు పాఠశాలల్లో 29.37 శాతం మాత్రమే ఉందన్నారు. మరో వారం రోజుల్లో సర్కార్ బడుల్లో విద్యార్థుల హాజరు 45శాతానికి పైగా పెరిగే అవకాశాలున్నాయని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనమని కలెక్టర్ శర్మన్ అభిప్రాయపడ్డారు.
గత ఏడాది వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అధిక ఫీజులు కట్టలేక ఆయా పాఠశాలలను వీడి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను చూసి కూడా అనేక మంది విద్యార్థులు చేరుతున్నట్లు చెప్పారు. మొత్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు అన్ని కలిపి సోమవారం వరకు జిల్లాలో 29.84 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు.