మేడ్చల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన వసతులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మేడ్చల్ జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 28,827 అడ్మిషన్లు రాగా, ఇందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి అడ్మిషన్లు తీసుకున్న వారు 15,669 మంది పిల్లలు ఉన్నారు.
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యనందిస్తుండడంతో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 99 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్ మండలంలో 3821 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ.16 కోట్లను వెచ్చించనున్నారు. ప్రహరీల నిర్మాణం, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, అదనపు తరగతి గదులు, మరమ్మతులకు వీటిని వినియోగించనున్నారు.