హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మావన అక్రమ రవాణాపై ప్రతిఒక్కరూ పోరాడాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పిలుపునిచ్చారు. ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించిన కౌంటరింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఐదు రకాల హ్యాండ్బుక్స్ను శుక్రవారం గవర్నర్ ఆవిష్కరించి, డ్యూటీ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో తీవ్రమైన హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని అన్నారు. ఈ ఊబిలో నుంచి బయటపడిన బాధితులు వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రజ్వల సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రచురించిన హ్యాండ్ బుక్స్ను ఉపయోగించుకొని బాధ్యత గల అధికారులు, సివిల్ సొసైటీ సభ్యులు మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతాకృష్ణన్, యూఎస్ కాన్సులేట్ అధికారులు, గవర్నర్ సెక్రటరీ సురేంద్రమోహన్ పాల్గొన్నారు.