మెహిదీపట్నం జూన్ 26: ఈసారి ఆషాడ బోనాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో జూలై 11న గోల్కొండ కోటపైనున్న జగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు దేవాదాయశాఖ అధికారులు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గోల్కొండ కోటలో జూలై 11న (ఆదివారం) బోనాలు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఆదివారం, గురువారం బోనాల సమర్పణ, పూజలు జరుగుతాయి. జూలై 11న మొదటిపూజ, 15న రెండో పూజ, 18న మూడో పూజ, 22న నాలుగో పూజ, 25న 5వ పూజ, 29న 6వ పూజ, ఆగస్టు1న 7వ పూజ, 5న 8వ పూజ, 8న 9వ పూజ జరుగనున్నది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోల్కొండ కోటలో ఆషాడం బోనాలను ఘనంగా నిర్వహించడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవిడ్ను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాం. ప్రజలు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలి.