వెంగళరావునగర్, అక్టోబర్ 1: వెండికి బంగారం పూత పూసి హాల్మార్క్ ముద్రతో నగల వ్యాపారులు, పాన్బ్రోకర్లను బురిడీ కొట్టించాడు ఓ ఘరానా మోసగాడు. నగరంలోని సుమారు 200కు పైగా వ్యాపారులను మోసగించి రూ.6కోట్లకు పైగా స్వాహా చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. బోరబండ సైట్-1 కమాన్ సమీపంలో పాన్ బ్రోకర్, నగల వ్యాపారం చేస్తున్న గణేష్ చౌదరి వద్దకు కబీర్నగర్కు చెందిన వెంకట్రెడ్డి (59) 2019 అక్టోబర్ 20న వచ్చాడు. తన వద్ద 7 గ్రాముల బంగారు ఉంగరం ఉందంటూ చెప్పి వ్యాపారికి చూపించాడు.
అక్కడికక్కడే పరీక్షించడంతో పాటు హాల్మార్క్ గుర్తు ఉండటంతో గణేశ్చౌదరి అది బంగారమే నమ్మి ఉంగరాన్ని తాకట్టు పెట్టుకొని రూ.16000 ఇచ్చాడు. అనంతరం మరో రెండు సార్లు వచ్చి రెండు ఉంగరాలు ఇచ్చి మొత్తం రూ.41,000 వేలు తీసుకుపోయాడు. అయితే ఆ ఉంగరాలను తిరిగి తీసుకుపోవడానికి వెంకట్రెడ్డి రాకపోవడంతో గణేశ్ చౌదరి వాటిని కరింగించేందుకు ప్రయత్నించగా అవి వెండి ఉంగరాలని తేలింది.
ఇదిలా ఉంటే గత నెల 29న మరోసారి వెంకట్రెడ్డి అదే పాన్బ్రోకర్ గణేశ్ వద్దకు ఉంగరాలతో వచ్చాడు. అప్పటికే మోసాన్ని గ్రహించిన గణేశ్ వెంకట్రెడ్డిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఎస్.ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 18 చోట్ల వెంకట్రెడ్డి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. నగరంలో మొత్తం 200కు పైగా పాన్ బ్రోకర్లు, నగర వ్యాపారుల వద్ద ఈ తరహా నకిలీ ఉంగరాలు, తాళిబొట్లు పెట్టి కోట్ల రూపాయల నగదు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వెండి ఉంగరాలపై బంగారం పూత పూసిన వెంకట్రెడ్డి వెనుక ఓ పెద్ద ఆభరణాల ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహా ఉంగరాలను ఆగ్రా, గుంటూరు ప్రాంతాల్లో తయారు చేస్తుంటారని.. అయితే నిందితుడు వెంకట్రెడ్డి మాత్రం కేవలం కమీషన్ ప్రాతిపదికన తాకట్టు పెట్టడంతో పాటు.. నగరంతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకట్రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.