కేపీహెచ్బీ కాలనీ కేంద్రంగా మోసం
ఒకరు అరెస్టు.. పరారీలో ఇద్దరు
నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని పోలీసుల సూచన
అమెరికా డాలర్పై పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించండి అంటూ నమ్మించి ఓ బాధితుడి నుంచి రూ.16 లక్షలు కొట్టేసిన ముఠాలో కీలక సూత్రధారిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. హయత్నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అమెరికా డాలర్ల మీద పెట్టుబడి పెట్టండని.. భారీగా లాభాలు వస్తాయని ఆశపుట్టించారు. దీని కోసం ఇన్స్టా గ్లోబల్ పే ట్రేడింగ్ వెబ్ సైట్లో ట్రేడింగ్ చేయాలని సూచించాడు. దీంతో బాధితుడు కొంత డబ్బు ఇన్స్టా గ్లోబల్ పేలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి “మీకు వంద అమెరికా డాలర్లు లాభం వచ్చింది. రూ.3 వేలు చెల్లిస్తే.. 100 అమెరికా డాలర్లు మీ సొంతం అవుతాయి” అని నమ్మించారు. దీంతో ఇన్స్టా గ్లోబల్ పేలో బాధితుడికి కేటాయించిన యూజర్ ఐడీకి 100 అమెరికా డాలర్లు లాభం వచ్చినట్లు వర్చువల్గా చూపించారు. ఇది నమ్మి వ్యాపారి రూ.3 వేలు వేయడంతో అతడి దగ్గర నుంచి మరింత డబ్బు లాగాలని పథకం పన్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తరచుగా వ్యాపారికి ఫోన్ చేసి పెట్టుబడి పెట్టండి., భారీగా లాభాలు పొందండి.. అంటూ తెలిపారు.