1.13 కిలోల బంగారం స్వాధీనం
ఉండవెల్లి, ఏప్రిల్10: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీదుర్గయ్య కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన చైతన్యకుమార్ హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం బెంగళూరుకు బయలుదేరారు. పంచలింగాల చెక్పోస్టు వద్దకు రాగానే పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించారు. చైతన్య వద్ద ఉన్న సూట్కేసులో రూ.3 కోట్ల 5 లక్షల 35,500 నగదును గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేని కారణంగా నగదును స్వాధీనం చేసుకొని చైతన్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ, సీఐ తెలిపారు. అలాగే ఏపీలోని కర్నూల్ జిల్లా పీఎంజే జ్యూవెల్లరీ షాపు సిబ్బంది నర్సింగ్, శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో వస్తుండగా వారి వద్ద ఉన్న కిలో 13 గ్రాముల బంగారం, రూ.లక్షల విలువైన వజ్రాలను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.