జీడిమెట్ల, ఏప్రిల్ 30 : పాపం పసికందు.. 5 నెలల పసిపాపను తాను ప్రయాణిస్తున్న ఆటోలోనే వదిలేసింది ఓ తల్లి.. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…. శుక్రవారం ఉదయం షాపూర్నగర్ నుంచి గాజులరామారం రోడ్డువైపు వెళ్లే ఆటోను ఓ మహిళ.. తన 5 నెలల పసిపాపతో ఎక్కింది. అయితే.. ఆడపిల్ల అనో లేదా మరో కారణమో తెలియదుగాని ఆ పసికందును ఆటోలోనే వదిలేసి ఆటో దిగి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి పసిపాప ఏడుపు విన్న ఆటో డ్రైవర్ రాజు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాపను షాపూర్నగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు చేయించారు. అనంతరం పాపను అమీర్పేటలోని శిశు విహార్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.