సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): మొదటి వివాహంతో మోసపోయింది. మ్యాట్రిమోనిలో రెండో వివాహం కోసం చేసుకున్న దరఖాస్తు ఆమె జీవితంలో సంతోషాన్ని నింపుతుందని ఆశించింది. ఆమె ప్రొఫైల్కు స్పందించిన వ్యక్తి కంటి అద్దాల ఫ్రేమ్ను పంపిస్తానని నమ్మించి కేవలం 5 రోజుల్లోనే రూ. 14 లక్షలు కొట్టేశాడు. కొన్నేండ్ల పాటు దాచుకున్న సొత్తు పోవడంతో బాధిత మహిళ కంగుతిన్నది. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. మల్కాజిగిరికి చెందిన మహిళ (40) రెండో వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో తన ప్రొఫైల్ను పెట్టింది.
ఆ ప్రొఫైల్ను చూసిన ఓ వ్యక్తి ఆమెకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. తన పేరును అనికేత్గా పరిచయం చేసుకుని, స్వస్థలం పంజాబ్ అని.. ప్రస్తుతం లండన్లో ఉంటూ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు మెసేజ్లో పేర్కొన్నాడు. తాను భార్యను కోల్పోయానని, తనకు 10 ఏండ్ల బాబు ఉన్నాడని మెసేజ్లో వివరించారు. మహిళ ప్రొఫైల్ నచ్చిందంటూ.. అంగీకరిస్తే వివాహం చేసుకుందామని ప్రతిపాదనను పెట్టాడు. ఇలా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి చాటింగ్ను మొదలు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అనికేత్ తాను కంటి అద్దాలకు సంబంధించిన ఫ్రేమ్ను గిఫ్ట్గా పంపిస్తానని చెప్పాడు. ఆ మరుసటి రోజు మహిళకు కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ వచ్చింది. మీకు లండన్ నుంచి పార్సిల్ వచ్చింది.. ప్రాసెస్ ఫీజు కింద రూ.35 వేలు చెల్లించాలన్నారు. దీంతో మహిళ ఆ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించింది.
మరికొద్ది సేపటి తర్వాత మరో నంబరుతో కాల్ వచ్చింది. ఈ పార్సిల్లో విదేశీ కరెన్సీ ఫౌండ్స్ ఉంది. వాటికి ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి.. లేదంటే మీ మీద కేసు అయ్యే అవకాశం ఉందని బెదిరించారు. బాధిత మహిళ మాత్రం తనకు పార్సిల్ వద్దంటూ తేల్చి చెప్పింది. అయినా.. వినకుండా ఆమెకు తరచూ ఫోన్లు చేశారు. ఆమె వద్దనుంచి రూ. 14 లక్షలు ఆన్లైన్ ద్వారా కాజేశారు. ఇంకా నగదు పంపాలంటూ వేధించాడు. దీంతో బాధిత మహిళ తన డబ్బు తిరిగి ఇచ్చేయమని నిలదీయడంతో వారి ఫోన్లు బంద్ అయ్యాయి. మోసపోయినట్లు ఆసల్యంగా గుర్తించిన బాధిత మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఇది నైజీరియన్ మోసంగా భావిస్తున్నారు.