హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులను ప్రోత్సహించేందుకు రెండో విడతలో 2 లక్షల మందికి రూ.400 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా ఈ రుణాలు ఇవ్వాలన్న మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గతేడాది తొలి విడతలో బ్యాంకుల ద్వారా 3.52 లక్షల మందికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.352 కోట్ల రుణాలను అందించారు. ఈ మొత్తాన్ని 12 నెలల్లో తిరిగి చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. ఈ బాకీలను సక్రమంగా తిరిగి చెల్లించినవారికి రెండో విడతలో రూ.20 వేల చొప్పున రుణాలు అందజేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. అన్ని నగరాలు, మున్సిపాల్టీల్లో 2,00,123 మందికి అతితక్కువ వడ్డీతో రుణాలను ఇప్పించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నది.
సక్రమంగా తిరిగి చెల్లిస్తే వడ్డీ లేనట్లే
తొలి విడతలో రూ.10 వేల రుణానికి వడ్డీని 7 శాతంగా నిర్ణయించారు. సంవత్సరంలోపు ఈ రుణాన్ని తిరిగి చెల్లించినవారికి 5 శాతం వడ్డిని తిరిగి ఇచ్చేస్తారు. రుణాలు పొందిన వ్యాపారులు ఏడాదిపాటు ప్రతి నెలా రూ.25 వేల కంటే ఎక్కువగా 250 డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే వారి ఖాతాల్లో నెలకు రూ.100 చొప్పున జమ చేస్తారు. దీంతో మొత్తంగా లెక్కిస్తే ఆ వ్యాపారికి ఎలాంటి వడ్డీ లేకుండానే రూ.10 వేల అందినట్టు అవుతుంది.
సాటిలేని తెలంగాణ
వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేదు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రుణ వితరణ లక్ష్యంలో సాధించింది 68 శాతమే. తెలంగాణ మాత్రం 91% లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్రంలో ‘పట్టణ ప్రగతి’ చేపట్టకముందు కేవలం 83 వేల మంది వీధివ్యాపారులు మాత్రమే రుణాల కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పట్టణ ప్రగతిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అతి తక్కువ సమయంలోనే 5 లక్షల మందికిపైగా వీధి వ్యాపారులను రిజిష్ట్రర్ చేయించారు.