సిటీబ్యూరో, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ ) : ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ మార్చి వరకు రూ.1800 కోట్ల నిర్ధేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా..మంగళవారం నాటి వరకు రూ. 874 కోట్లు మాత్రమే వసూళ్లను రాబట్టుకున్నది.
నిర్ణీత గడువు ముగింపునకు సమయం దగ్గరపడుతుండడం..మరో పక్క బకాయిల జాబితాలో ఎక్కువగా వివిధ వ్యాపారస్తులు, కమర్షియల్ కేటగిరిలో ఉన్న వాళ్లే అధికంగా ఉన్నారని గుర్తించారు.
ఆస్తిపన్ను చెల్లింపులో జాప్యం చేస్తున్న వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
బకాయిల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ ఈ మేరకు రోజూ ఉదయం టెలికాన్పరెన్స్ ద్వారా ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షిస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా జోన్ల వారీగా సమీక్షలు చేస్తూ వసూళ్లలో వేగం పెంచారు.
ఇందులో భాగంగానే బకాయిదారులకు నోటీసులు జారీ చేయడం, స్పందించని వారిపై చర్యలు తీసుకోవడం లాంటివి చేపడుతున్నారు. వ్యాపారస్తులకు సంబంధించి షాపులను సీజ్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి రూ. 950కోట్లను దాటించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.