వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్న మహానగరంలో అడ్రస్సు తెలుసుకోవడం అంత సులువు కాదు. ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలన్నా, కొత్తవారు ఫలానా ప్రదేశానికి పోవాలన్నా ప్రయాసే. ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ.. గ్రేటర్వ్యాప్తంగా స్ట్రీట్ సైనేజ్ పోల్స్ (వీధి సూచిక స్తంభా లు) ఏర్పాటు చేయబోతోంది. జోన్కు 500 చొప్పున గ్రేటర్లోని ఆరుజోన్లలో 3 వేల స్తంభాలను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్వోటీ) పద్ధతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఒక్కో పోల్పై 5 బోర్డులు ఏర్పాటు చేయనుండగా, పైభాగంలో జీహెచ్ఎంసీ సూచిక.. కింద నాలుగుబోర్డులు ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తారు. ఈ నూతన విధానంతో సులువుగా దారి తెలియడంతోపాటు జీహెచ్ఎంసీకి ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ఉన్న చోట నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. నగర పర్యటనలో కొత్త వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరాలన్నా కష్ట సాధ్యమైన పని. కానీ ఇక మీదట జీహెచ్ఎంసీ పరిధిలో గమ్యం చేరే ప్రక్రియ సులువు కానున్నది. గ్రేటర్ పరిధిలో కొత్త తరహా స్ట్రీట్ సైనేజ్ పోల్స్ (వీధి సూచికలు) ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, కూకట్పల్లి ఇలా ఒక్కో జోన్లో 500 పోల్స్ చొప్పున నగర వ్యాప్తంగా 3వేల పోల్స్ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ స్తంభంపై వ్యాపార సంస్థల ప్రకటనలకు అవకాశం కల్పించనున్నారు.
తొలుత ఆయా మార్గం (సూచిక)చూపే బోర్డు, తర్వాత సంబంధిత ఏరియాలో నాలుగు వ్యాపార సంస్థల ప్రకటనలకు సంబంధించిన బోర్డులు సైనేజ్ పోల్స్పై ఉంటాయి. ఆయా మార్గాల్లో ఉన్న వ్యాపార సంస్థలు తమ సంస్థకు దారి తెలిపేలా, ఎంత దూరంలో ఉందో తెలిసేలా ప్రకటించుకోవచ్చు. తమ సంస్థకు సంబంధించిన లోగో/బ్రాండ్ వంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంత రేటుకు అనేది స్తంభాలను ఏర్పాటు చేసిన ఏజెన్సీనే ఖరారు చేయనున్నది. ఈ విధానంతో కొత్త వారికి దారి తెలిసే సదుపాయంతో పాటు జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల గురించి తెలిసే సదుపాయం కలుగుతుందని పేర్కొంటున్నారు.
ఎంపిక చేసిన జంక్షన్లలో ఈ స్తంభాలు ఉంటాయి. స్తంభానికి ఉన్న అన్నింటికంటే పై బోర్డును జీహెచ్ఎంసీకి రిజర్వ్ చేస్తారు. ఏ రోడ్డు ఎటువైపు వెళ్తుందో తెలిపే డైరెక్షన్, ఒక మార్గంలోని ప్రభుత్వ సంస్థ వివరాలు, అందరికీ ఉపకరించే ముఖ్య సమాచారం దానిపై ఉంచుతారు. ఏ సమాచారం ఉండాలనే నిర్ణయం జీహెచ్ఎంసీనే ప్రకటిస్తుంది. దిగువన ఉండే నాలుగు సైనేజ్ బోర్డులను వ్యాపార సంస్థలు.. తమ సంస్థకు దారి చూపుతూ ప్రకటించుకోవచ్చు.