ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు, అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. బల్దియా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపులతో నగరంలో మీసేవ, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్ఎస్సీ) రద్దీగా మారాయి. చాలాచోట్ల బారులు తీరి పన్ను చెల్లించడం కనిపించింది. బల్దియా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1900 కోట్లు కాగా, బుధవారం అర్ధరాత్రి వరకు రూ.1677.47కోట్లు సమకూరినట్లు సమాచారం. కరోనా తీవ్రత, గతేడాది రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు, వరుసగా ఎన్నికలు రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ రికార్డుస్థాయిలో పన్నులు వసూలు కావడం విశేషం.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారం అర్ధరాత్రి 12గంటలకు ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం 1,900 కోట్లు నిర్దేశిత లక్ష్యం కాగా, బుధవారం రాత్రి వరకు 1,677.47 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలు అయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజులోనే సుమారు 40కోట్లకు పైగా ఆస్తిపన్నులు వసూలయ్యాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19, రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, వరుస ఎన్నికలు రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ భారీగా పన్ను వసూళ్లను రాబట్టడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం రాత్రి వరకు సుమారు 12,16,116 మంది ఆస్తిపన్నులు చెల్లించారని అధికారులు వెల్లడించారు. కాగా గతేడాది 10,50,539 మంది నుంచి సుమారు 1,357.12 కోట్ల వరకు పన్ను రాబట్టారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను చెల్లించడానికి వీలుగా బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సిటిజన్ సర్వీస్ కేంద్రాలు రాత్రి 12 గంటల వరకు యథావిధిగా పనిచేశాయి. అర్ధ సంవత్సర ఆస్తిపన్ను చెల్లించడానికి ఈ నెల 31తో గడువు ముగిసిన నేపథ్యంలో, జనవరి 1వ తేదీ నుంచి ఆస్తి పన్ను బకాయిలపై రెండు శాతం జరిమానాతో అధికారులు పన్నులు రాబట్టనున్నారు. సిటిజన్ సర్వీస్ సెంటర్లతోపాటు మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూడా నగర ప్రజలు ఆస్తిపన్ను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే సిటిజన్ సర్వీస్ సెంటర్లు అర్ధరాత్రి వరకు పని చేయడంతో మరో నాలుగైదు కోట్ల వరకు పన్ను వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.