వరంగల్, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూలై 1 నుంచి పది రోజుల పాటు చేపడుతున్న పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కార్పొరేషన్లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అన్నారు. నగరాలు పచ్చదనంతో ఉండేలా ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటి, పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆమె అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఐదు డివిజన్లకు 2 జేసీబీలు, ఒక డోజర్, ట్రాక్టర్ కేటాయించాలని అన్నారు. గ్రేటర్ టార్గెట్ 13 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న 17 లక్షల మొక్కలను ప్రణాళికాబద్ధంగా నాటాలని చెప్పారు. ఇంటింటికీ 6 మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆదనపు కమిషనర్ నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్వో సునీత, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా పాల్గొన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలి
సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసేలా కృషి చేయాలని బహుజన సంక్షేమ సంఘం ప్రతినిధులు మేయర్ గుండు సుధారాణికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కార్పొరేషన్లో ఆమెను కలిసి వినతి పత్రం అందచేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్కుమార్, జిల్లా అధ్యక్షులు గోగికార్ క్రాంతికుమార్, ప్రతినిధులు కలకంటి శ్రీనివాస్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూడో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం అర్బన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్ల ప్రత్యేక అధికారులు, పర్యవేక్షణ అధికారులతో ఆమె పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో నిర్వహించాలని చెప్పారు. ప్రతి డివిజన్కు ప్రత్యేక అధికారితోపాటు ఐదు డివిజన్లకు సూపర్వైజర్ను నియమించామని వెల్లడించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సీనియర్ సిటిజన్లతో కలిపి 15 మందితో కమిటీ వేయాలని అన్నారు. వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో గ్రేటర్ అదనపు కమిషనర్ నాగేశ్వర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్వో సునీత, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్యాదవ్, డీఎఫ్వో కిశోర్, ప్రత్యేక అధికారులు, పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.