కరీంనగర్ : భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కోర్కల్ రైతువేదికను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయరంగం గొప్ప ఉపాధి ఇస్తోందన్నారు. రైతుబంధు అద్భుతమైన కార్యక్రమం అన్నారు. 2018లో ఎన్నికల కోసమే రైతుబంధు అని విమర్శించారు. కరోనా కష్ట కలాంలోనూ రైతుబంధు కొనసాగించినట్లు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతుబంధు లేదన్నారు. డిమాండ్ అనుసరించి పంటలు సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. జీఎస్టీ పేరిట కేంద్రానికి ట్యాక్స్ వెళ్లడమే తప్ప మనకు వచ్చేది ఏమీ లేదని మంత్రి పేర్కొన్నారు.