నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
మూడు నుంచి పదో తరగతి విద్యార్థులకు క్లాస్లు
టీశాట్, టీవీల ద్వారా పాఠాలు వీక్షించనున్న విద్యార్థులు
వరంగల్రూరల్, జూన్ 30(నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో 50 శాతం మంది పనిదినాల్లో ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కానున్నారు. మిగతా యాభై శాతం మంది ఉపాధ్యాయులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తారు. ఆన్లైన్ విధానంలో ప్రసారమయ్యే తరగతులను టీషాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులు వీక్షిస్తారు. వరంగల్ రూరల్ జిల్లాలో 695 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, మోడల్, కేజీబీవీ, పాఠశాలలున్నాయి. వీటిలో 39,645 మంది విద్యార్థులున్నారు. మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు జూలై ఒకటి నుంచి ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ సూచనల ప్రకారం పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో 50 శాతం మంది విధిగా స్కూళ్లకు హాజరవుతారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లోని పేర్ల ప్రకారం జాబితా తయారు చేసి రెండు సమూహాలు చేసుకుంటారు. సమూహ వివరాలను మండల విద్యాధికారులకు సమర్పిస్తారు. ప్రతి సమూహంలోని ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. మొదటి సమూహంలోని ఉపాధ్యాయులు సోమ, బుధ, శుక్రవారం, రెండో సమూహంలోని ఉపాధ్యాయులు మంగళ, గురు, శనివారం పాఠశాలకు హాజరవుతారు. ఆయా పాఠశాల ఉపాధ్యాయులు ఇందుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటారు. పాఠశాలకు హాజరుకాని రోజు ఇంటి వద్ద ఉండే మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులు వర్క్ ఫ్రం హోం చేస్తారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు సెల్ ఫోన్ల ద్వారా వారిని పర్యవేక్షిస్తారు. ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు పాఠశాలకు వెళ్తారు. మిగతా రోజుల్లో ఇంటి నుం చి వర్క్ ఫ్రం హోం ద్వారా పర్యవేక్షిస్తారు.
మొబైల్స్ ద్వారా పర్యవేక్షణ
ఆన్లైన్ విధానంలో తరగతుల నిర్వహణను ఉపాధ్యాయులు మొబైల్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. విద్యార్థుల్లో ఎవరెవరు, ఎంతమంది వీక్షించారనేది పరిశీలిస్తారు. వివరాలను పాఠశాలకు హాజరైన, ఇంటి నుంచి వర్క్ ఫ్రం హోం చేసిన ఉపాధ్యాయులు ప్రతిరోజూ టీచర్ డైరీగా పిలిచే వ్యక్తిగత రిజిస్టర్లో నమోదు చేస్తారు. విద్యార్థులందరి డిజిటల్ డివైజెస్ మ్యాపింగ్ చేస్తారు. డివైస్ లేని విద్యార్థులను సమీపంలోని డివైస్ కలిగిన విద్యార్థులతో జత చేసి ఆన్లైన్ తరగతులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటారు. ఎలాంటి డిజిటల్ డివైస్ కూడా అందుబాటులో లేని విద్యార్థులకు సమీపంలోని గ్రామ పంచాయతీ లేదా లైబ్రరీల్లో పాఠాలు వీక్షించే ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థుల దత్తత, ఆన్లైన్ పాఠాల వివరాలు ప్రతి టీచర్ వద్ద ఉండాలని, పాఠశాలల్లో ప్రదర్శించాలని కూడా ప్రభుత్వం సూచించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా బోధించే పాఠ్యాంశాలు టీశాట్, దూరదర్శన్ ద్వారా నిర్ణీత సమయంలో ప్రసారమవుతున్నాయా లేదా అనేది ఉపాధ్యాయులు పరిశీలించాలని పేర్కొంది. విద్యార్థులు సెల్ ఫోన్లు, కంప్యూటర్ గాని ఉపయోగిస్తే వాటి కనెక్షన్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఉపాధ్యాయులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ వీటిని అత్యంత ప్రాధాన్యాంశాలుగా భావించాలని తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరం కోసం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి టూషన్ ఫీజు మాత్రమే అది కూడా నెలవారీగా వసూలు చేసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు విడదల చేసింది.