హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కుండపోత వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వర్షాకాలం విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు కాలనీలు, బస్తీలు, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిని సారించారు. వరదనీటి కాలువలు, తరచుగా నీరు నిలిచే ప్రాంతాలలో ముందస్తు చర్యలను చేపట్టారు. వర్షాలతో తలెత్తనున్న సమస్యలన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో మురుగునీరు కాలువల సమస్యను నివేదించేందుకు, ఫిర్యాదు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. నగర పౌరులు వివరాలను 9848021665 కు వాట్సాప్ చేయవచ్చని తెలిపింది. అదేవిధంగా కాలువ ప్రదేశంతో పాటు ఫోటోలను కూడా పంపవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ప్రజలు ఫిర్యాదులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ నంబర్ 9848098166 కు కూడా నివేదించవచ్చని వెల్లడించింది.
కాలువలను వెడల్పు చేసేందుకు అదేవిధంగా మరమ్మత్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .45 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు సమర్థవంతంగా, యుద్ధ ప్రాతిపదికన జరిగేలా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు జూన్ 14 నుండి 19 వరకు పరిశీలించనున్నారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ సైతం జూన్ 14న బేగంపేటలో వర్షం నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించనున్నారు. నాలాలకు సంబంధించిన పనులను సీఎం కేసీఆర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నిరంతరం పర్యవేక్షించనున్నారు.