సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగించి పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. కళ తప్పిన చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రాలుగా ముస్తాబు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులను పరిరక్షించి, సుందరీకరించాలని ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా అధికారులు గడిచిన కొన్ని నెలలుగా చెరువుల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తొలి విడుతలో 63 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ. 94.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
సుందరీకరణ పనుల్లో భాగంగా గ్రీనరీ డెవలప్మెంట్, చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ఫ్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్శించేలా బ్యూటీఫికేషన్, పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూల మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర సుందరీకరణ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. కొన్ని చోట్ల కోర్టు కేసులు, స్థానిక సమస్యలతో పనుల్లో అంతరాయం ఏర్పడిందని, మిగతా చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలాఖరులోగా 63 చెరువులకు అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో నగరంలోని అనేక చెరువుల కట్టలను సరిచేయ్యడం, తూములు, అలుగులకు మరమ్మతులు చేయడంతో పాటు నీరు బయటకు పోయే ప్రాంతాలను క్లీన్ చేశారు. దాదాపు రూ.9.5కోట్లతో పనులు చేపట్టారు. ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. వరద ఎకువగా వచ్చే చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని చెరువుల వద్ద ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో గండ్లు పడకుండా చెరువు కట్టలను బలోపేతం చేస్తున్నారు.
రూ.94.17 కోట్లతో 63 చెరువులకు సుందరీకరణ పనులు చేపడుతున్నారు.
హుస్సేన్సాగర్ లేక్ వాటర్ బాడీ మేనేజ్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో 48 చెరువులు
జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ పరిధిలో 15 చెరువులు
48 చెరువులకుగానూ రూ.61.20కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.12.47కోట్లు ఖర్చు చేశారు.
తుర్కయాంజాల్లోని మాసాబ్ చెరువు పర్యాటక కేంద్రంగా మారింది. రూ.90 లక్షల వ్యయంతో పూడికతీత, కట్టకు మరమ్మతులు చేపట్టిన అధికారులు, రూ.1.32 కోట్లతో సుమారు కిలోమీటర్ మేర చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ నిర్మించారు. అంతేకాకుండా పచ్చదనం, పూలమొక్కలు, బెంచీలు, మంచినీటి సౌకర్యం, మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. అర్బన్ ఫారెస్టు సహకారంతో కట్ట పొడవునా ఏర్పాటుచేసిన రకరకాల పూల మొక్కలు సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. త్వరలోనే చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు.