ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ కల్పిస్తూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎర్లీబర్డ్ పథకం గడువు శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఎర్లీబర్డ్ పథకం ద్వారా ఆరు జోన్ల నుంచి రూ.600 కోట్ల నిర్ధేశిత లక్ష్యంలో రూ.363.87 కోట్ల మేర మాత్రమే ప్రభుత్వం వసూలు చేయగలిగింది.
కరోనా ప్రభావంతో రూ. 236.13 కోట్ల మేర వసూళ్లను రాబట్టలేకపోయింది. గతేడాది ఎర్లీబర్డ్ పథకం ద్వారా ఐదు లక్షల వినియోగదారుల నుంచి రూ.573కోట్ల మేర రాబట్టుకోగా, ఈ సారి రూ.210కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఆస్తిపన్ను చెల్లించే వ్యక్తులు, సంస్థలు, కార్యాలయాలు కరోనా కోరల్లో చిక్కారని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉన్నా మహమ్మారితో ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం కావడంతో చెల్లింపులకు పలువురు దూరంగా ఉన్నారని వారు పేర్కొన్నారు.