అమరావతి : కరోనా నివారణకు కృష్ణంపట్నం ఆనందయ్య మందు తయారీ, పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మందు తయారీ, పంపిణీని విరమించుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఆయుర్వేద పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్) ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఆనందయ్య ఔషధానికి ఆయుర్వేదశాఖ నుంచి ఇంకా గుర్తింపు రాలేదని ఆయన వెల్లడించారు.
గుర్తింపు లేకుండా ఔషధం తయారీ, పంపిణీ సరికాదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆనందయ్య ఔషధంతో కరోనా తగ్గుతుందని తేలలేదని సీసీఆర్ఏఎస్ నిర్ధారించిందని, ఔషధంలో హానికారక పదార్థాలు మాత్రం లేవని తేలిందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు మందు వాడొచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపిందని గుర్తుచేశారు.
కరోనా రోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగైన సేవలందిస్తున్నదని వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. కొన్నిచోట్ల సౌకర్యాలు లేనందునే మెరుగైన సేవలు అందడం లేదని ఆయన స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు తమ వంతు సహకరించడం అభినందనీయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ బాధిత ప్రాణాలు కాపాడేందుకు అమెరికా తెలుగు సంఘం ముందుకు వచ్చిందని, తెలుగు రాష్ట్రాలకు 600 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా ఇచ్చిందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.