మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 26: అనుమతి లేని వెంచర్పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి బండ్లగూడ కల్సా మొఘల్ కాలనీ సర్వే నంబర్లు 103/3/పీ, 172, 173లో సుమారు 10 ఎకరాల స్థలంలో ప్రైడ్ ఇండియా వెంచర్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు సర్కిల్ అధికారులు రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రాణి ఆధ్వర్యంలో వెంచర్లోని రెండు భవనాలను నేలమట్టం చేశారు. ప్రహరీలు, రోడ్లు, డివైడర్లను సైతం తొలగించారు. అనుమతులు లేకుండా మరోసారి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదు. ఇల్లు, వెంచర్ వేస్తే అనుమతులు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలపై కేసులు నమోదు చేస్తాం. -రాణి, రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ