చెత్త తొలగింపు ప్రాథమిక విధి అని.. పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలపై అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో చేపడుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా సోమవారం ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా సర్కిళ్ల పరిధిలోని ఈఈ, డీఈ, ఏఎంహెచ్ఓ, ఏఎంసీ, ఏసీపీలు పారిశుధ్య నిర్వహణను వందశాతం చేపట్టాలన్నారు.
ప్రతిరోజు ఉదయం ఆరుగంటల లోపే అధికారులు ఫీల్డ్లో పర్యటించాలని సూచించారు.ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రోడ్లపై చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. మరోవైపు నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులపై మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటనలుకొనసాగిస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అనేక చోట్ల చెత్త పేరుకుపోవడంపై అధికారుల నుంచి వివరణ కోరారు. ఇదిలా ఉంటే మేయర్కు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి పారిశుధ్య పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎక్కడా చెత్త పోగుపడకుండా చూడాలని కోరారు.