సిటీబ్యూరో, సెప్టెంబరు 24(నమస్తే తెలంగాణ): ఒకరోజులోనే రూ.5 వేల కోట్లు మంజూరు చేయడం ఇదే ప్రథమమని, జీవోలు కూడా వెంటనే జారీ చేయడం చరిత్రలో మొదటిసారి అని, మహా నగరానికి ఇదో అత్యుత్తమ చరిత్ర, ఈ చరిత్ర కేవలం సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే నిరూపితమైందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్లకు పైగా జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావులకు జీహెచ్ఎంసీ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. రానున్న 15 ఏళ్ల పాటు హైదరాబాద్ నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మురుగునీటి శుద్ధికి రూ.3,866 కోట్లు, మంచినీటి అవసరాలకు రూ.1,200 కోట్లు మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. హైదరాబాద్ ప్రజలు అన్ని పార్టీల కార్పొరేటర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు తెలిపారు. నగర శివారు ప్రాంతాలకు సైతం తాగునీరు అందించేందుకు రూ.1200 కోట్లను మంజూరు చేయడం సాహసోపేత నిర్ణయంగా భావిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిత్యం 1650 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతుండగా, 25 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా 772 ఎంఎల్డీల (46.78 శాతం) మురుగునీరు శుద్ధి అవుతుందని మేయర్ వివరించారు. 100 శాతం మురుగునీటిని శుద్ధి చేయాలన్న లక్ష్యం ఒక వైపు, మరోవైపు రానున్న 15 ఏళ్ల ప్రజా అవసరాల దృష్ట్యా 1259 ఎంఎల్డీల శుద్ధికి గానూ రూ.3866.21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. శుద్ధి చేసిన మురుగునీటిని తాగునీటికి మినహా మిగిలిన అన్నింటికి పునర్ వినియోగించేలా చర్యలు తీసుకుంటామని మేయర్ అన్నారు.
ఓఆర్ఆర్ గ్రామాల్లో చేపట్టనున్న రూ.1200 కోట్ల తాగునీటి పథకంతో 20 లక్షల మంది జనాభాకు మేలు జరగనుందని, సుమారు రెండు 2 లక్షల మంచినీటి కొత్త కనెక్షన్లను కూడా రెండేళ్లలో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు మన్నే కవిత, వనం సంగీత యాదవ్, మాధవరం రోజాదేవి, జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.