సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): రక్షణ, స్వయం సహాయక బృందాలకు జీవనోపాధి తదితర అంశాలను పరిశీలించడానికి మహారాష్ట్ర అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, ఉద్యోగులు మంగళవారం జీహెచ్ఎంసీని సందర్శించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, అర్బన్ కమ్యునిటీ డెవలప్మెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, మహిళా శిశుసంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమరావతి కౌన్సిలర్లకు వివరించారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న 42,165 స్వయం సహాయక బృందాలలో 4 లక్షల మంది మహిళా సభ్యులున్నారని తెలిపారు. మహిళా గ్రూపులకు బ్యాంకు ద్వారా రుణాలను అందించి వారికి స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని వారికి అడిషనల్ కమిషనర్ శంకరయ్య వివరించారు. అర్బన్ కమ్యునిటీ డెవలప్ మెంట్ కోసం నేరుగా టౌన్ లేవల్ ఫెడరేషన్కు కొత్త అంశాలపై శిక్షణను ఇస్తున్నామని తెలిపారు. దీంతో స్లమ్ లేవల్ ఫెడరేషన్, స్వయం సహాయక బృందాల ద్వారా క్షేత్ర స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు నిరంతరాయం కృషి చేస్తున్నామని తెలిపారు.
స్వయం సహాయక బృందాల్లోని ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా రూ. 54 వేల వరకు రుణం లభిస్తుందన్నారు. దీంతోపాటు మహిళా సంఘాల కుటుంబాలు రూ. 25 వేల నుంచి రెండు లక్షల వరకు రుణ సౌకర్యం పొందుతున్నారని వివరించారు. నేషనల్ అర్బన్ లేవల్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ద్వారా నిరాశ్రయులైన వారికి జీవనోపాధి, శిక్షణ వంటి సేవలను అందిస్తున్నామని తెలిపారు. వీధి వ్యాపారులకు, నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక చేయూత అందించడంతోపాటు వారికి బీమా సౌకర్యాన్ని కూడా జన్ధన్, పీఎం సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి ద్వారా అందిస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ యాచక రహిత నగరంగా గుర్తింపు సాధించిందని, ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రానున్న మూడేండ్లలో ఎన్జీవోల సహకారంతో వంద శాతం పురోగతి సాధిస్తుందని మహారాష్ట్ర అమరావతి కౌన్సిలర్ల బృందానికి జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు.
అనంతరం మహిళా, శిశుసంక్షేమ శాఖ ద్వారా కిశోర బాలిక, గర్భిణులకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్, హెల్త్ చెకప్, ఇమ్యునైజేషన్, రెఫరల్ సర్వీసెస్, చిన్నారుల ఎత్తు, బరువులపై తీసుకుంటున్న చర్యలు, మహిళలకు రక్తహీనతపై, కేసీఆర్ కిట్, అమ్మఒడి, కల్యాణలక్ష్మి, ఆసరా, షీ- టీమ్, భరోసా వంటి పథకాలపై అమరావతి కౌన్సిలర్ల బృందానికి శివాలర్ రెడ్డి, నర్సింహారెడ్డి వివరించారు.
మహిళా, శిశు సంక్షేమానికి మాకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని మహారాష్ట్ర అమరావతి కౌన్సిలర్ల బృందం హర్షం వ్యక్తం చేసింది అంగన్వాడీలో రోజువారీగా మహిళలకు అందిస్తున్న పోషకాహారం సేవలు బాగున్నాయని కొనియాడారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం విస్తృతస్థాయిలో నిధులను ఖర్చుచేయడం విశేషమన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య ప్రజెంటేషన్ ద్వారా జీహెచ్ఎంసీ చేస్తున్న పనులపై కౌన్సిలర్లకు వివరించారు. అమరావతి కౌన్సిలర్లు వందనహార్నే, సునంద, లవీనాహార్పి, స్వాతి కులకర్ణి, రుబీనా తబస్విన్, ఇందు, పద్మజ, నీలేశ్ వావి సాకర్, అమోల్ సాకురే, తదితరులు పాల్గొన్నారు.