సిటీబ్యూరో/మేడ్చల్, సెప్టెంబరు 20(నమస్తే తెలంగాణ): మహా నగరంతో పాటు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసాయి. మేడ్చల్లో సోమవారం తెల్లవారు జాము వరకు నిమజ్జనాలు కొనసాగాయి. అయితే, నగరంలో నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా ముగిసింది. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథులతో పాటు ఆదివారం భారీ సంఖ్యలో గణనాథులు నిమజ్జనం కాగా, సోమవారం సాయంత్రం వరకు నిమజ్జన శోభాయాత్ర సాగింది.
ఈ రెండు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు భజనలు, నృత్యాలు చేస్తూ గణనాథునికి ఘనమైన వీడ్కోలు పలకడం గమనార్హం. ఐతే, ఈ నెల 10న వినాయచవితి మొదలు మరుసటి రోజు నుంచే చిన్న, చిన్న, సాధారణ విగ్రహాలను భక్తులు సమీపంలోని కొలనులలో నిమజ్జనం చేశారు.
పీఓపీల విగ్రహాలను ఆయా చెరువులతో పాటు, హుస్సేన్సాగర్ వైపు కదిలిన గణనాథులను ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ లో ప్రత్యేక క్రేన్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చే శారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అన్ని చోట్ల కలిపి 85వేల విగ్రహాలను నిమజ్జనం చేయగా, 27 వేలకు పైగా విగ్రహా లు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. కాగా, పది అడుగుల పైబడిన విగ్రహా లు రెండు రోజుల్లో 5,700 వరకు నిమజ్జనం అయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. వేలాది విగ్రహా లు, టన్నుల కొద్ది వ్యర్థాలను అతి తక్కువ సమయంలోనే తొలగించి జీహెచ్ఎంసీ స్వచ్ఛతను చాటింది.
హుస్సేన్సాగర్ నుంచి పదివేల (10,091) మెట్రిక్ వ్యర్థాలను తరలించామని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగం అధికారులు పేర్కొన్నారు. నగరంలోని చెరువులు, బేబీ పాండ్స్లలో 83,186 ప్రతిమలను తొలగించారు. అయి తే, 60 వేల 97 ప్రతిమలను బేబీ పాండ్స్ నుంచి, 23, 094 ప్రతిమలను చెరువులలో నుంచి తొలగించారు. నిమజ్జన చెత్తను తొలగించేందుకు 303 కి.మీ. పొడవునా 215 యాక్షన్ టీమ్లు, 8,116 మంది పారిశుధ్య కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎంటమాలజీ విభాగం సిబ్బంది 1600 మంది పాల్గొన్నారు.
నిమజ్జనం వ్యర్థాలను వెలికితీసి ‘క్లీన్ హుస్సేన్సాగర్’గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేసింది. సోమవారం సాయంత్రం నాటికి 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మేడ్చల్ జిల్లాలోని 17 చెరువులలో 25,188 వినాయకులు నిమజ్జనం జరిగినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వెల్లడించారు.
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ఎంతో ప్రశాంతంగా ముగిసింది. శోభాయాత్ర సందర్భంగా భక్తు లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, ఎలక్ట్రికల్, ఆర్ అండ్ బీ, వాటర్ వర్స్, రెవెనన్యూ, అగ్ని మాపక శాఖ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి తలసాని అభినందనలు తెలిపారు. ఆదే విధంగా శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా సహకరించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, ఉత్సవ మండపాల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.