సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తేతెలంగాణ): నగరం ముంపు బారిన పడకుండా నాలాల ఆధునీకరణ, పూడికతీత, పెరుగుతున్న జనాభాకు తగినట్లు పునర్వవ్యస్థీకరించేందుకు బల్దియా చర్యలు ప్రారంభించింది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) పనులను వేగవంతం చేయాలన్న పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రూ.67 కోట్లతో కూడిన పనులకు ఈ వారంలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. రూ.858కోట్ల అంచనాతో పనులను మొత్తం 15 ప్యాకేజీలుగా విభజించారు. అక్టోబర్ చివరికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, వానలు తగ్గుముఖం పట్టగానే పనులను పరుగులు పెట్టించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.