సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో సాఫీ ప్రయాణమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. రహదారుల నిర్వహణలో రాజీ లేకుండా పనులు చేస్తున్నది. అద్దంలా రోడ్లను తీర్చిదిద్దుతున్నది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద సుమారు రూ.1839 కోట్లతో చేపట్టిన పనులను అధికారులు 401 విభాగాలుగా విభజించారు. మొత్తం 709 కిలో మీటర్ల మేర రహదారులను ఆధునీకరించేందుకు జోన్ల వారీగా కాంట్రాక్ట్ ఏజెన్సీలకు పనులు అప్పగించారు. తొలి విడుతగా (2019-20) 329.9 కిలోమీటర్ల మేర పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి పూర్తి చేశారు. ఇక రెండో విడుతలో (2020-21)208.7 కిలోమీటర్ల పనులకు శ్రీకారం చుట్టగా జూలై చివరి నాటికి 112 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. ఇక మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.