అమీర్పేట్, ఏప్రిల్ 14: చెత్త కుండీలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న జీహెచ్ఎంసీ ఆలోచనలకు అనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు పౌరులు కూడా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు. సనత్నగర్, అమీర్పేట్ డివిజన్ల పరిధిలోని సమస్యాత్మకంగా మారిన చెత్తకుండీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో ఆయా పరిసరాలు ఆహ్లాదంగా మారుతున్నాయి. కుండీలను తొలగించిన పరిసరాలను జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేసి రంగు రంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతున్నారు. ఆయా ప్రదేశాల్లో పందిరి వేసి అందులో కుండలను ఏర్పాటు చేసి చలివేంద్రాలుగా మార్చేస్తున్నారు. కొద్ది రోజుల పాటు ఇదే పద్ధతిలో ఇక్కడ చెత్త డంప్ కాకుండా చూడడం ద్వారా పౌరులను తమ ఇళ్ల వద్దకు వచ్చే గార్బేజీ రిక్షాలలోనే డంప్ చేసే విధంగా అలవాటు చేసుకుంటే పరిస్థితిలో మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సనత్నగర్, అమీర్పేట్ పరిసరాల్లో దాదాపు 30వేల ఇండ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోంది. ఇందుకు దాదాపు 47 స్వచ్ఛ ఆటోలు, 70 వరకు రిక్షాలు చెత్త సేకరణ కోసం పని చేస్తున్నాయి. రెండు డివిజన్లలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు 43 గ్రూపులు (301 మంది కార్మికులు) పని చేస్తున్నాయి. అయితే స్వచ్ఛ ఆటోలు, రిక్షాలు ప్రతిఇల్లు చేరుతూ చెత్త సేకరణ జరిపేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. డంపర్ బిన్ల అవసరం లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం సనత్నగర్ బస్టాండ్, 60 ఫీట్ లింగయ్యనగర్, డీకే రోడ్డు, జీహెచ్ఎంసీ అమీర్పేట్ స్టేడియం తదితర ప్రాంతాల్లోని చెత్త డంపరన్ బిన్లతో మార్గాల్లో రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు తలెత్తుతుండేవి. మారిన పరిస్థితుల వల్ల ఇటీవలి వరకు చెత్త చెదారంతో దుర్వాసన వెదజల్లిన ఇక్కడి పరిసరాలు ఇప్పుడు దాహార్తిని తీర్చే చలివేంద్రాలుగా మారాయి.
పారిశుధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ చేపడుతున్న విధానాలకు ప్రజలు తమ తోడ్పాటును అందించాలి. ఎక్కడికక్కడ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు వీలుగా తొలగిస్తున్న డంపర్ బిన్ల స్థానంలో స్వచ్ఛ రిక్షాలు, ఆటోలు ఇళ్ల వద్దకే వస్తుంటాయి. పౌరులు వాటిని సద్వినియోగం చేసుకుంటే డంపర్ బిన్ల అవసరం ఏమాత్రం ఉండదు. సేకరించిన చెత్తనంతా ఒకేచోట డంప్ చేసి అక్కడి నుంచి భారీ వాహనాల సహాయంతో డంపింగ్ యార్డులకు తరలిస్తారు. కొద్ది రోజులు ఇదే పద్ధతిని అవలంభిస్తే.. అనూహ్య మార్పులను చూస్తారు. – డాక్టర్ భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్, ఖైరతాబాద్