సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సీవరేజీ పనుల బాధ్యతలను మళ్లీ జలమండలికే అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, చార్మినార్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్ పరిధిలోని జోనల్ కమిషనర్లకు సూచించారు. 2020 మార్చి నెలకు ముందు జలమండలి నుంచి అద్దెకు తీసుకున్న యంత్రాలను తిరిగి ఇచ్చేయాలన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు శివారు ప్రాంతాల్లో సీవరేజీ పనుల నిర్వహణ జలమండలి చేపడుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన సామగ్రిని, ఉద్యోగులను జలమండలికి ఆగస్టు 31లోపు అప్పగించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.