సిటీబ్యూరో, మేడ్చల్/ జూలై 30 (నమస్తే తెలంగాణ ) : అనుమతి లేని లేఅవుట్లు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన మొదలైంది. క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్-2020 కింద వచ్చిన దరఖాస్తులతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,06,891, హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 60వేలకు పైగా, మేడ్చల్ జిల్లాలో 1,79,699 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తులను క్లస్టర్ల వారీగా విభజన చేసి, ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సులభంగా చేపట్టేందుకు వీలుగా గ్రామం, వార్డు, సర్వే నంబరు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించే ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, పంచాయతీరాజ్ అధికారులతో సంబంధిత జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ఏర్పాటు చేసే బృందాలు దరఖాస్తుల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన జరుపనున్నారు. సదరు ప్లాటు ప్రభుత్వ భూమిలో ఉందా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? వంటి అంశాలను పరిశీలించి దరఖాస్తు క్రమబద్ధీకరించేందుకు అర్హత ఉందా? లేదా? అనే దానిపై నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన మాత్రమేనని, క్రమబద్ధీకరణలో అర్హత గల ప్లాట్ల యాజమానులకు ఫీజులు, ప్రొసీడింగ్స్ జారీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.